మోడీ కేబినెట్లో అగ్రకులాలకే ప్రాధాన్యం.. ఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులో తెలుసా..?
మోడీ కొత్త సర్కార్ గురువారం కొలువుదీరింది. రాష్ట్రపతి భవన్లో మోడీతో పాటు పలువురు ఎంపీలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 58 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక మోడీ కేబినెట్లో అగ్రకులాల వారికే పెద్ద పీట వేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలోని మంత్రుల్లో ఆరుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారుకాగా.. గిరిజనులు నలుగురికి చోటు లభించింది. ఇందులో ఎక్కువ మంది ఒడిషా జార్ఖండ్ నుంచి ఉన్నారు. ఇక సిక్కు సామాజిక వర్గం నుచి అకాళీదల్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, బీజేపీ ఎంపీ హర్దీప్ పూరిలు ఉన్నారు. ముస్లిం సామాజిక వర్గం నుంచి ముఖ్తార్ నక్వీ అబ్బాస్ మాత్రమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కుల సమీకరణాల ఆధారంగా కూడా కొందరికి మంత్రి పదవి లభించింది. సార్వత్రిక ఎన్నికల్లో హిందీ ప్రధాన రాష్ట్రాల్లో కూడా కొన్ని కులాలు బీజేపీ వైపు మొగ్గు చూపాయి. ఉత్తర్ ప్రదేశ్ బీహార్లాంటి ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీకి పలు సామాజిక వర్గాల వారు కూడా ఓటు వేశారు. ఇక కేబినెట్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన 9 మందికి ప్రాధాన్యత ఇచ్చారు. ఉత్తర్ప్రదేశ్ సీఎంగా ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన యోగీ ఆదిత్యనాథ్ ఉన్నారు. ఇక మహేంద్రనాథ్ పాండేకు కేబినెట్ బెర్తు ఇచ్చి ఠాకూర్ సామాజిక వర్గంలో కాస్త ఊరట కలిగించింది బీజేపీ.
ఇక మోడీ కేబినెట్లోకి అర్జున్ ముండాకు అవకాశం ఇవ్వడంతో గిరిజన సామాజిక వర్గాన్ని మంచి చేసుకునే పనిలో పడింది. ఈ ఏడాది జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్ననేపథ్యంలో ఈ సమీకరణాన్ని వినియోగించినట్లు తెలుస్తోంది. ఇక రఘుబర్ దాస్ గిరిజనేతర వ్యక్తి. అయినప్పటికీ పలు గిరిజన ప్రాంతాల్లోని ఓటర్లను ఆకట్టుకుని అక్కడ విజయం సాధించడంతో ఆయనకు కూడా కేబినెట్ బెర్తు ఇవ్వడం జరిగింది.