గుడికెళ్లిన దళిత యువకులను చితక్కొట్టారు: నీళ్లడిగితే ముఖంపై మూత్రం పోశారు
కృష్ణగిరి: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని కరువనూరులో దారుణ ఘటన జరిగింది. వేడుక సందర్భంగా ఆలయానికి వచ్చిన ఇద్దరు దళిత యువకులపై అగ్రకులానికి చెందిన కొంతమంది దాడి చేసి చితక్కొట్టారు. అంతేగాక, దాహం వేస్తుందని అడిగిన ఓ యువకుడి ముఖంపై మూత్రం పోసి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఎం అరవిందన్(20) అనే యువకుడు బెంగళూరులో ఓ ప్రవేటు కంపెనీలో పని వెల్డర్గా చేస్తున్నాడు. మార్చి 2న అతని స్వగ్రామంలోని ఆలయంలో వేడుకలు జరుగుతున్న సందర్భంగా అరవిందన్ అతని బంధువు దినేష్(20)తో కలిసి ఆలయానికి వచ్చారు.
ఆలయం వద్ద వున్న పలువురు అక్రకులానికి చెందిన వ్యక్తులు వీరిద్దర్నీ పరుష పదజాలంతో దూషించారు. అరవిందన్, దినేష్లు వారిని అడ్డుకోవడంతో ఇద్దర్నీ తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత అలాగే ఆ ఇద్దరు యువకులను కొట్టుకుంటూ సమీపంలోని టాయ్లెట్ వద్దకు లాక్కెళ్లారు.
అగ్రకులాల గుంపు దెబ్బలకు తాళలేక కిందపడిపోయాడు అరవిందన్. దాహం వేస్తుందని మంచినీళ్లు అడిగిన అరవిందన్ ముఖంపై నిందితులు మూత్రం పోశారు. కాగా, అక్కడ్నుంచి ఎలాగోలా తప్పించుకున్న దినేష్.. అరవిందన్ బంధువులకు విషయం చెప్పాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అరవిందన్ బంధువులు, అతడ్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన అరవిందన్కు వైద్యులు చికిత్స అందించారు.
అరవిందన్ బంధువుల ఫిర్యాదు మేరకు కొళ్లావి పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేందుకు పోలీసులు నిరాకరించారని అరవిందన్ బంధువులు తెలిపారు. అగ్రకులాల నుంచి డబ్బులు తీసుకున్న పోలీసులు, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేందుకు నిరాకరిస్తున్నారని తమిళనాడు కురవన్ పఝంకుడిన మక్కల్ సంఘం ఆరోపించింది. ఘటనపై తాము కోర్టును ఆశ్రయిస్తామని సంఘం నాయకులు తెలిపారు.