రాజ్యసభ: విజయసాయిరెడ్డి సంచలనం - ‘దళారీ కాంగ్రెస్’ వ్యాఖ్యలపై రగడ - మోదీ వెంటే జగన్
వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై పెద్దల సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు, ప్రధాని నరేంద్ర మోదీకి తమ సంపూర్ణ మద్దతు తెలియజేసేక్రమంలో వైసీపీ ప్రదర్శించిన దూకుడు రాజ్యసభలో కలకలానికి దారితీసింది. వ్యవసాయ బిల్లులను సమర్థిస్తూ.. వాటిని అడ్డుకుంటోన్న కాంగ్రెస్, ఇతర విపక్షాలను ఉద్దేశించి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మూత? - వైసీపీ నిర్ణయమే కీలకం - రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు
రాజ్యసభలో ఆ మూడు బిల్లు..
వ్యవసాయ రంగంలో సంస్కరణలు అంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులు.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లులు రాజ్యసభ ముందుకు వచ్చాయి. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లుల్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు ముక్తకంఠంతో ఈ బిల్లుల్ని వ్యతిరేకించగా, బీజేపీ, కాంగ్రెస్ కు సమాన దూరం పాటిస్తోన్న ఇతర పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.
బీజేపీకి వైసీపీ వత్తాసు
వ్యవసాయ బిల్లుల విషయంలో అధికార బీజేపీ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తోన్న వైసీపీ.. లోక్ సభ మాదిరిగానే రాజ్యసభలోనూ బిల్లులకు మద్దతు తెలిపింది. అంతటితో ఊరుకోకుండా.. బీజేపీకి వత్తాసు పలుకుతూ విపక్షాలపై వైసీపీ దాడికి దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆదివారం రాజ్యసభలో మాట్లాడుతూ.. తాము వ్యవసాయ బిల్లుల్ని సమర్థిస్తున్నామని, దీనిపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నదని అన్నారు. ‘‘వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకించడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర సరైన కారణమే లేదు. అది పచ్చిగా దళారీ(మధ్యవర్తి)లాగా వ్యవహరిస్తున్నది''అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
షాకింగ్ : ట్రంప్కు విషం పార్సిల్ - తాకితే 36 గంటల్లో ఖతం - ఎన్నికల వేళ కలకలం
సాయిరెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..
కాంగ్రెస్ పార్టీని ను దళారీగా అభివర్ణిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపై సభలో తీవ్ర కలకలం రేగింది. వైసీపీ తన సొంత అభిప్రాయాన్ని చెప్పడం తప్పుకాదని, వ్యతిరేక పార్టీలపై విమర్శలు చేయడం మాత్రం కచ్చితంగా తప్పేనని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అన్నారు. కాంగ్రెస్ సహా పలువురు విపక్ష ఎంపీలు.. విజయసాయి రెడ్డి క్షమాపణలకు డిమాండ్ చేశారు. గొడవ ముదురుతుండటంతో సభాపతి జోక్యం చేసుకుంటూ.. సాయిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సభలో వైసీపీ.. బీజేపీ గొంతులా మారడం శోచనీయమని పలువురు ఎంపీలు అన్నారు.