యూపీఎస్సీ : లాస్ట్ అటెంప్ట్ మిస్సయినవాళ్లకు ఊరట.. మరో ఛాన్స్ ఇచ్చిన కేంద్రం..
యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది కేంద్రం. గతేడాది కరోనా కారణంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరుకాలేని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు అంగీకరించింది. చివరి ప్రయత్నం కోల్పోయినవారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. రచనా సింగ్ అనే సివిల్స్ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్ మేరకు గతంలో సుప్రీం ఇచ్చిన సూచనను అనుసరించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
2020లో సివిల్స్ కోసం చివరి ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులు కరోనా కారణంగా పరీక్షకు హాజరుకాలేకపోయిన విషయాన్ని రచనా సింగ్ తన పిటిషన్ ద్వారా సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... ఈ అంశాన్ని పరిశీలించాలని గతేడాది సెప్టెంబర్లో కేంద్రం,యూపీఎస్సీ కమిషన్లకు సూచించింది. అయితే,ఆ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వడం పట్ల ఈ ఏడాది జనవరిలో కేంద్రం విముఖత వ్యక్తం చేసింది. ప్రభుత్వ పరీక్షల వ్యవస్థపై ఇది ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.
కానీ మరోసారి సుప్రీం సూచనను పరిశీలించిన కేంద్రం తన నిర్ణయం మార్చుకుంది. కరోనా కారణంగా చివరి ప్రయత్నంలో ఎవరైతే పరీక్షకు హాజరుకాలేకపోయారో వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆ అభ్యర్థులు 2021లో నిర్వహించే సివిల్స్ పరీక్షలకు హాజరవచ్చు. ఈ క్యాలెండర్ ఇయర్లో నిర్వహించే పరీక్షకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ తర్వాతి పరీక్షలకు వారిని అనుమతించరు.
కాగా,గతేడాది మే నెలలో జరగాల్సిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 4న నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 4,86,952 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. దాదాపు 10వేల పైచిలుకు మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. 2021 సివిల్స్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న విడుదల కానుంది.