యూపీఎస్ సీ చీటింగ్ కేసు: ఐపీఎస్ అధికారి భార్యకు బెయిల్ మంజూరు, 18 నెలల కుమార్తె!
చెన్నై: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్ సీఈ మెయిన్స్) పరీక్షలో మాస్ కాపియింగ్ కు పాల్పడి అరెస్టు అయిన తమిళనాడు ఐపీఎస్ అధికారి సఫీర్ కరీం భార్య జాయిస్ జాయ్ కు చెన్నై కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. తన కుమార్తె ఆరోగ్యం కాపాడుకోవడానికి బెయిల్ మంజూరు చెయ్యాలని జాయిస్ జాయ్ కోర్టులో మనవి చేశారు.
తన కుమార్తె కు 18 నెలలు మాత్రమే నిండాయని, చెన్నై సెంట్రల్ జైల్లో దోమల కారణంగా అనారోగ్యానికి గురై నరకం అనుభవిస్తున్నదని, ఆమె ఆరోగ్యం కాపాడుకోవడానికి మానవత్వంతో బెయిల్ మంజూరు చెయ్యాలని ఐపీఎస్ అధికారి సఫీర్ కరీం బార్య జాయిస్ జాయ్ న్యాయస్థానంలో అర్జీ సమర్పించారు.
శనివారం అర్జీ పరిశీలించిన న్యాయమూర్తి జాయిస్ జాయ్ కి బెయిల్ మంజూరు చెయ్యడానికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ప్రశ్నించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో న్యాయమూర్తి జాయిస్ జాయ్ కు బెయిల్ మంజూరు చేశారు.
తమిళనాడులోని తిరునల్వేలీ జిల్లాలోని నాగునేరిలో అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ఏసీపీ)గా ఉద్యోగం చేస్తున్న ఐపీఎస్ అధికారి సఫీర్ కరీం చెన్నైలోని ఎగ్మూరులోని యూపీఎస్ఈ పరీక్షా కేంద్రంలో మాస్ కాపియింగ్ కు పాల్పడి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయాడు.
సఫీర్ కరీంకు నుంచి రహస్య కెమెరా, మొబైల్ ఫోన్ బ్లూటూత్ సీజ్ చేసి అరెస్టు చేశారు. పరీక్ష కేంద్రంలో ఉన్న ఐపీఎస్ అధికారి సఫీర్ కరీంకు హైదరాబాద్ నుంచి సమాధానాలు చెబుతున్న ఆయన భార్య జాయిస్ జాయ్ ను అక్కడే అరెస్టు చేశారు. జాయిస్ జాయ్ తో పాటు ఆమె 18 నెలల కుమార్తెను చెన్నై సెంట్రల్ జైలుకు తరలించారు.