UPSC:అన్ని పరీక్షలు ఇంటర్వ్యూలు వాయిదా , మే 3 తర్వాత కొత్త తేదీలు: యూపీఎస్సీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత్లో అయితే రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఇక భారత్ గత నెల 25 నుంచి లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో భారత్లో ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇతర ఇబ్బందులు కూడా తలెత్తాయి.లాక్డౌన్ నేపథ్యంలో అన్ని వాణిజ్య వ్యాపారాలు మూతపడ్డాయి. అదే సమయంలో విద్యాసంస్థలు కూడా మూతపడ్డాయి. ఇక ఆయా ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలు, లేదా రిక్రూట్మెంట్లను నిలిపివేసింది. కొన్నిటికి దరఖాస్తు చేసుకునేందుకు తేదీలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా తన పరిధిలో వచ్చే అన్ని రిక్రూట్మెంట్లను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కోవిడ్ -19 విజృంభిస్తున్న నేపథ్యంలో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలు ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్వ్యూలకు సంబంధించి కొత్త తేదీలను మే 3 తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో మరోసారి యూపీఎస్సీ సభ్యులంతా సమావేశమై కొత్త తేదీలపై తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు దేశం నలుమూలల నుంచి ఢిల్లీకి రావాల్సి ఉన్నందున పరిస్థితిని సమీక్షించాకే కొత్త తేదీలు వెల్లడిస్తారని యూపీఎస్సీ పేర్కొంది.
సివిల్ సర్వీసెస్ 2019 పర్సనల్ టెస్టులకు సంబంధించి తాజా తేదీలను కూడా 2020 మే 3 తర్వాత వెల్లడిస్తామని యూపీఎస్సీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే సివిల్ సర్వీసెస్ 2020కి ప్రిలిమ్స్, ఇంజినీరింగ్ సర్వీసెస్ మెయిన్స్, జియాలజిస్టు సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్కు సంబంధించి తేదీలను ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇవన్నీ లాక్డౌన్ సమయంలో ఉండటంతో కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. అన్ని తేదీలను యూపీఎస్సీ వెబ్సైట్ పై పొందుపరుస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2020లకు సంబంధించి కొత్త తేదీలను ప్రకటించింది యూపీఎస్సీ.
ఇక CAPF ఎగ్జామ్ 2020కి సంబంధించి యూపీఎస్సీ వెబ్సైట్పై పొందుపరుస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఇక నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్షను ఇప్పటికే వాయిదా వేయడం జరిగింది. కొత్త తేదీ మళ్లీ ప్రకటించడం జరుగుతుంది. 10 జూన్ 2020న ఎన్డీయే -2 పరీక్షకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉంటే యూపీఎస్సీ ఛైర్మెన్, మరియు సభ్యులు ఏప్రిల్ 2020 నుంచి తమ బేసిక్ వేతనం నుంచి ఒక ఏడాదిపాటు 30శాతం పీఎం కేర్స్కు విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.