సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ -2020 పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..?
న్యూఢిల్లీ: కరోనావైరస్తో ఇప్పటికే పలు పరీక్షలను వాయిదా వేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే ఎప్పుడు నిర్వహిస్తామన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇక లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై లాక్డౌన్ ముగిసిన తర్వాత తీసుకుంటామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే చెప్పింది. ఇక సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం మే 31న జరగాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ పేర్కొంది. అయితే కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది యూపీఎస్సీ.
సివిల్ సర్వీసెస్ పరీక్ష మూడు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా ప్రిలిమ్స్ ఆ తర్వాత మెయిన్స్ అటుపై ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది యూపీఎస్సీ. ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తుంటారు. ఇక ఈ ఏడాది దాదాపుగా 796 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది యూపీఎస్సీ. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో సోమవారం భేటీ అయిన బోర్డు సభ్యులు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు డిసైడ్ అయ్యారు. లాక్డౌన్ నేపథ్యంలో అమలులో ఉన్న ఆంక్షలను పరిగణలోకి తీసుకున్న అధికారులు పరీక్షలతో పాటు ఇంటర్వ్యూల తేదీలను కూడా వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు యూపీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇక ప్రిలిమ్స్ పరీక్షనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కు కూడా స్క్రీనింగ్ పరీక్షగా పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఇండియన్ ఫారెస్టు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ పేర్కొంది. మే 20వ తేదీన మరోసారి పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పిన బోర్డు కొత్త తేదీలను యూపీఎస్సీ వెబ్సైట్పై ఉంచుతామని స్పష్టం చేసింది. అయితే పరీక్ష తేదీలకు 30 రోజుల సమయం ఉండేలా రూపొందిస్తామని యూపీఎస్సీ వెల్లడించింది. ఇప్పటికే యూపీఎస్సీ నిర్వహించే పలు పరీక్షలకు సంబంధించిన తేదీలను వాయిదా వేసింది.