రాజీనామా చేస్తే మంచిదేమో, ఇంత దారుణమా?: అద్వానీ అసంతృప్తి
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కిషన్ అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఇంతకుముందే కేంద్ర మంత్రి అనంతకుమార్ వద్ద ఈ విషయం చెప్పిన ఆయన.. ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్తో ఈ విషయమై మాట్లాడారు.
సభ సజావుగా జరిగేందుకు జోక్యం చేసుకోవాలని రాజ్నాథ్ను ఆయన కోరారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడమే మంచిదని అనిపిస్తోందని అద్వానీ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని వాజ్పాయి ఈ సభలో ఉండి ఉంటే చాలా బాధపడేవారని ఆయన చెప్పారు.
ఒకవైపు ప్రతిపక్షం, వాళ్లకు దీటుగా అధికార పక్షం కూడా తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో లోక్సభ శుక్రవారానికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా పలుమార్లు వాయిదా పడుతూ సాగింది. ఏ ఒక్క అంశంపై కూడా చర్చలు జరగడం లేదు. దీంతో ఈ తీరుపై అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, నవంబర్ 16న ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభల సమావేశాలు శుక్రవారం(డిసెంబర్ 16)తో ముగియనున్నాయి. అయితే, సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచి ఈ రోజు వరకు దేనిపైనా చర్చ జరిగింది లేదు. నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై చర్చ జరగాలంటూ విపక్షాలు ఉభయసభల్నీ స్తంభింపజేయడంతో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది.
ఈ సమావేశాల్లో 10 ముఖ్యమైన బిల్లులపై చర్చ జరిపి వాటిని ఆమోదించాల్సి ఉండగా, ఇప్పటివరకు నాలుగు బిల్లులు మాత్రమే ఆమోదానికి నోచుకున్నాయి. నోట్ల రద్దు అంశంపై ప్రధాని సభలో జరిగే చర్చలో పాల్గొని తమ వాదనలు వినాలని, సమాధానాలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. చర్చకు తాము సిద్ధమని, మోడీ చర్చలో పాల్గొంటారని ప్రభుత్వం చెప్పినప్పటికీ విపక్షాలు వినలేదు. దీంతో పార్లమెంట్ను సజావుగా నిర్వహించడంలో అటు ప్రభుత్వం, విపక్షాలు రెండూ విఫలమయ్యాయి.
ఇటీవలే సభలు జరుగుతున్న తీరుపై రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రజలు ఓట్లువేసి గెలిపించి పార్లమెంట్కు పంపించింది తమ సమస్యలపై చర్చిండానికే తప్ప పరస్పర నిందారోపణలకు కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.