కార్తీ అరెస్టుపై మల్లగుల్లాలు.. లోక్పాల్పై ప్రధాని ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్!
న్యూఢిల్లీ: ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ వ్యవహారశైలి సరిగా లేదంటూ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో లోక్పాల్ ఏర్పాటుపై సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ప్రధాని పంపిన ఆహ్వానంపై ఖర్గే అసహనం వ్యక్తం చేశారు. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అరెస్టుపై ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ నేతలు 'అత్తమీద కోపం దుత్తమీద చూపించిన' చందాన వ్యవహరిస్తున్నారు.
నిబంధనల ప్రకారం.. లోక్పాల్ ఏర్పాటు సమావేశానికి ప్రధాని, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత కూడా హాజరుకావాలి. కానీ బుధవారం నాటి లోక్పాల్ సమావేశానికి తాము హాజరుకావడం లేదని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత ఖర్గే ప్రధానికి లేఖ రాశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశానికి హాజరుకావాలంటూ వచ్చిన ఆహ్వానంపై ఖర్గే ఆగ్రహానికి లోనయ్యారు.
ప్రధానమంత్రి ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ఆయన రాసిన లేఖలో ఆరోపించారు. 'అవినీతి నిర్మూలన కోసం కేంద్రం లోక్పాల్ను నియమించాలనుకుంటోంది. కానీ అయిదేళ్లుగా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రధాని ఓ రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించడం మంచిది..' అని ఆ లేఖలో ఖర్గే అభిప్రాయపడ్డారు.
INC COMMUNIQUE
— INC Sandesh (@INCSandesh) March 1, 2018
Letter by LS LoP @MallikarjunINC to the Prime Minister declining invitation to the 'Selection Committee' of the Lokpal as a 'Special Invitee'. pic.twitter.com/zQgf0WL8HC
రాజకీయ కుయుక్తితోనే ప్రధాని మోడీ తమకు సరైన విధంగా ఆహ్వానాన్ని పంపలేదని మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. కేవలం సుప్రీంకోర్టును సంతృప్తిపరిచేందుకే ఈ లోక్పాల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. అభిప్రాయ నమోదు, ఓటింగ్ హక్కులాంటివి లేకుండా సమావేశంలో పాల్గొనడం అనేది లోక్పాల్ ఎంపికలో వ్యతిరేకతను మినహాయించడానికి చేసిన ప్రయత్నమేనని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కలేదు. అయితే నిబంధనల ప్రకారం.. లోక్పాల్ నియామకం కోసం ప్యానల్లో ప్రతిపక్ష నేత కూడా ఉండి తీరాలి. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాల మేరకు చట్టంలో సవరణ చేస్తూ.. కాంగ్రెస్కు ఆహ్వానం పంపారు. అయితే ఆ ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంతో లోక్పాల్ నియామకం అనిశ్చితిగా మారింది.