ఏడ్చేసిన బిజెపి నేత జశ్వంత్: రాజీనామా యోచన?
జోధ్పూర్: వచ్చే సాధారణ ఎన్నికల్లో తను కోరుకున్న స్థానం నుంచి పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అంగీకరించకపోవడంతో తీవ్ర అసహనానికి లోనైన ఆ పార్టీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ కంటతడి పెట్టారు. దీంతో బిజెపిని వీడే ఆలోచనలో జశ్వంత్ సింగ్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాజీనామా నిర్ణయంపై ఆదివారం ప్రకటించే అవకాశం ఉంది.
జశ్వంత్ సింగ్ శనివారం ఎన్డీటీవితో మాట్లాడుతూ.. ‘మా అధిష్టానం నేను పుట్టిన లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకుంటే అంగీకరించడం లేదు. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా అధిష్టానం వ్యవహరిస్తోంది' అని చెబుతూ జశ్వంత్ సింగ్ కంటతడి పెట్టుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జశ్వంత్ సింగ్ బిజెపి అధిష్టానాన్ని కోరాడు.
కాగా అతన్ని కాదని ఇటీవల బిజెపిలో చేరిన రిటైర్డ్ ఫీల్డ్ కల్నల్ సోనా రాంచౌధరిని బర్మర్ నియోజక వర్గం నుంచి బరిలోకి దింపేందుకు బిజెపి సన్నాహాలు చేస్తోంది. అయితే జశ్వంత్ సింగ్ బర్మర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు ఆయన ఏ నిర్ణయం ప్రకటించలేదు.
ఈ విషయంపై బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. జశ్వంత్ సింగ్కు పార్టీలో గౌరవమైన స్థానం ఉందని తెలిపారు. ఆయనకిచ్చే గౌరవాన్ని కేవలం టికెట్ ద్వారా తీర్చుకోలేమని చెప్పారు. అనుకోకుండా ఈ విధంగా జరిగిందని, సీటు విషయంలో జశ్వంత్కు మరో అవకాశాన్ని చూస్తామని అతని సహచరుడు అరుణ్ జైట్లీ తెలిపారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఒత్తిడి మేరకే రాంచౌధరిని బిజెపిలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
జాట్ వర్గానికి చెందిన చౌధరి.. జాట్ వర్గీయులు మెజార్టీగా ఉన్న బర్మర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆమె అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. కాగా, 2009 లోకసభ ఎన్నికల్లో జశ్వంత్ సింగ్ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.