టాపర్ కాలేనందుకు.. గన్తో కాల్చుకుంది: హర్యానాలో విద్యార్థిని ఆత్మహత్య
న్యూఢిల్లీ: పరీక్ష ఫలితాల్లో టాపర్గా నిలవలేకపోయానన్న బాధతో ఓ విద్యార్థిని గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హర్యానాలోని సివాహ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థినిని గ్రామ సర్పంచ్ వేద్ పాల్ సింగ్ కుమార్తె అంజలిగా గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అఘాయిత్యానికి ముందు తండ్రికి ఫోన్ చేసిన అంజలి.. త్వరగా ఇంటికి రావాలని చెప్పింది.
ఇంటికి చేరకునేసరికే బాత్రూమ్ లో ఆమె విగతజీవిగా రక్తపు మడుగులో పడి ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. శనివారం పరీక్ష ఫలితాలు విడుదలైన కొద్దిసేపటికే ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీస్ అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. 'అంజలికి తక్కువ మార్కులేమి రాలేదని ఆమె తల్లిదండ్రులు మాతో చెప్పారు. అయితే ఫస్ట్ రాలేకపోయానన్న బాధతో ఆమె మనస్తాపానికి లోనైందని చెప్పారు.' అని వెల్లడించారు.