తీవ్ర స్థాయిలో ఉద్యమం: ప్రధాని మోడీకి అన్నా హజారే హెచ్చరిక
అవినీతికి వ్యతిరేకంగా గతంలో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టిన ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి పోరాటానికి సిద్దమవుతున్నారు.
న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా గతంలో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టిన ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి పోరాటానికి సిద్దమవుతున్నారు. లోక్పాల్ బిల్లు ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, లోక్ పాల్ కోసం మరోసారి తీవ్ర ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
ఈ మేరకు హెచ్చరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి అన్నా హజారే లేఖ రాశారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయినా లోక్ పాల్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందంటూ విమర్శించారు.
అవినీతిని అంతమొందించేందుకు ఇంతవరకు పటిష్టమైన చట్టాన్ని కూడా రూపొందించలేదని హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో లోక్పాల్ను నియమించడమే కాకుండా, ప్రతిరాష్ట్రంలో లోకాయుక్తను నియమించాలని డిమాండ్ చేశారు.
లోక్ పాల్ తోపాటు రైతు సంక్షేమం, ఆహార భద్రత గురించి వివరిస్తున్న స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు కోసం కూడా తాము ఉద్యమిస్తామని అన్నా హజారే స్పష్టం చేశారు.
త్వరలోనే తమ ఆందోళనలకు సంబంధించిన వివరాలు చెబుతామని చెప్పారు. గతంలో అన్నా హజారే అవినీతి అంతానికి లోక్ పాల్ బిల్లు పెట్టి, అమలు చేయాలని భారీ ఎత్తున ఉద్యమాలు చేసిన విషయం తెలిసిందే.