కోటీశ్వరురాలు: రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ (ఫోటోలు)
గుర్ గావ్: ఆమెకు రూ. కోట్ల విలువైన ఇల్లు ఉంది. రెండు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఆమె వ్యాపారవేత్త కాదు, కార్పొరేట్ ఉద్యోగి కాదు. రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకుని టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ మహిళ.
టీచర్ ఉద్యోగం వదిలిపెట్టి రోడ్డు పక్కన చెట్టు కింద టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న ఆమెను పలువురు అభినందిస్తున్నారు. ఆమె పేరు ఊర్వశి యాదవ్ (37). తన కుటుంబ సభ్యులకు చక్కటి భవిష్యత్తు అందిచేందుకు తాను టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నానని సంతోషంగా చెబుతున్నది.
గుర్ గావ్ సెక్టార్ 17 ఏ లో ఊర్వశి యాదవ్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఈమెకు రూ. మూడు కోట్లకు పైగా విలువైన ఇల్లు ఉంది. రెండు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. గతంలో ఊర్వశి యాదవ్ టీచర్ గా పని చేసేవారు.
భర్త కోసం
ఊర్వశి యాదవ్ భర్త అమిత్. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రముఖ నిర్మాణ కంపెనీలో అమిత్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసే వారు.
భర్తకు ప్రమాదం జరిగింది
భర్త అమిత్ గత మే నెలలో ప్రమాదానికి గురైనాడు. అతనికి తుంటి మార్పిడి శాస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. అయినా అమిత్ కు నడిచే అవకాశం లేదని వైదులు తెలిపారు. ఊర్వశి మామ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ గా పని చేసి రిటైడ్ అయ్యారు.
టీచర్ ఉద్యోగం నిలిపి వేసి
టీచర్ గా ఉద్యోగం చేస్తూ తన కుటుంబ సభ్యులను పోషించుకోలేనని ఊర్వశి భావించింది. వెంటనే ఉద్యోగానికి గుడ్ బై చెప్పింది.
కష్టం అయినా సరే
తనకు వంట చెయ్యడం అంటే ఇష్టం అని ఊర్వశి యాదవ్ అంటున్నారు. గుర్ గావ్ సెక్టార్ 14 లో రావి చెట్టు కింద బండి పెట్టుకుని టిఫిన్ చేసి విక్రయించడం మొదలు పెట్టారు.
ఇద్దరు పిల్లలకు మంచి శిక్షణ
తన ఇద్దరు పిల్లలు మంచి స్కూల్ లో విద్యాభ్యాసం చేస్తున్నారని, తాము ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నామని ఉర్వశి యాదవ్ అంటున్నారు.
రోజుకు రూ. 3,000 వేలు సంపాదన
తాను రోజుకు రూ. 2,500 నుంచి రూ. 3,000 వరకు సంపాదిస్తున్నానని, నా కుటుంబానికి సురక్షితమైన జీవితం అందించడానికి కష్టపడుతున్నానని ఊర్వశి యాదవ్ చెప్పారు. ఊర్వశి యాదవ్ పట్టుదలను చూసి ఆమెను చాల మంది అభినందిస్తున్నారు.