‘మమత టీఎంసీని విసిరిపారేయండి, బంగారు బెంగాల్ కోసం బీజేపీకి పట్టం కట్టండి’
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2021లో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం బంకుర జిల్లాలో నిర్వహించిన 13 జిల్లాల పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.
200కుపైగా అసెంబ్లీ సీట్లలో బీజేపీ గెలుపు..
2021లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లకు పైగా బీజేపీ గెలుస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో 294 స్థానాలున్నాయి. రాష్ట్రంలో బీజేపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కరోనా కారణంగా నేతలందరూ మాస్కులు ధరించాలని, సేఫ్టీ ప్రొటోకాల్ పాటించాలని సూచించారు. పశ్చిమబెంగాల్ పర్యటన సందర్భంగా అమిత్ షా ఛతుర్దిహి గ్రామంలో పర్యటించి అక్కడి ప్రజలతో ముచ్చటించారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, జాతీయ ప్రధాన కార్యదర్శి కౌలాష్ విజయవ్యార్గీయ, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, ఇతర నేతలు ఉన్నారు. స్థానిక ట్రైబల్ కమ్యూనిటీ నేత బిభిషాన్ హన్సడా నివాసంలో వీరంతా మధ్యాహ్న భోజనం చేశారు. గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న రాహుల్ సిన్హా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మమత సర్కారుకు చావుదెబ్బ తప్పదు..
పశ్చిమబెంగాల్లో టీఎంసీ ప్రభుత్వానికి చావుదెబ్బ తప్పదని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజార్టీతో గెలుస్తామని అమిత్ షా ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోవడం లేదని, వెనకబడిన, గిరిజన ప్రజలు బీజేపీవైపే ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా బిర్సా ముండా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
బంగారు బెంగాల్ కోసం బీజేపీని గెలిపించండి..
‘ఈ(మమతా బెనర్జీ) ప్రభుత్వాన్ని పడగొట్టాలని, సోనార్ బంగ్లా (బంగారు బెంగాల్) ను నిర్మించడానికి బిజెపికి అవకాశం కల్పించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను' అని అమిత్ షా తెలిపారు. కేంద్ర పథకాలను బెంగాల్ ప్రజలకు అందకుండా చేస్తున్నారని మమతా బెనర్జీపై షా మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసే పథకాలను అడ్డుకోవడం ద్వారా ప్రజావ్యతిరేకిగా మారారని అన్నారు.
బీజేపీది పగటి కలేనంటూ టీఎంసీ..
మరోవైపు మమతా బెనర్జీ కూడా బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘మేము రాజకీయ ముప్పు సహించము. ప్రజలు తమ పరిమితుల్లోనే ఉండాలి. బెంగాల్ ప్రజలు బయటి వ్యక్తులను అంగీకరించరు' అని అమిత్ షా పేరు చెప్పకుండా బెనర్జీ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిని వ్యాప్తి చేస్తోందని బీజేపీపై మండిపడ్డారు. 200 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని అమిత్ షా చెబుతున్నప్పటికీ.. అది వారికి పగటి కలగానే మిగిలిపోతుందని టీఎంసీ నేత సౌగతా రాయ్ అన్నారు.