యూరీ ఉగ్రదాడి: ఆధారాలు చూపి ‘పాక్’ కు సమన్లు జారీ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని యూరీ సెక్టార్ సైనిక శిబిరంపై జరిపిన ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పాకిస్తాన్కు భారత్ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జయశంకర్ భారత్లోని పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ను తన కార్యాలయానికి పిలిపించుకుని ఈ సమన్లు జారీ చేశారు.
సౌత్ బ్లాక్లోని క్యాబినెట్ సెక్రటేరియట్లో ఇరు దేశాలకు చెందిన నేతలు సమావేశమయ్యారు. యూరీ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్రపై ఆధారాలను బాసిత్కు అందజేశారు. ఈ ఉగ్రదాడిలో భారత జవాన్ల చేతిలో హతమైన నలుగురు ఉగ్రవాదుల వద్ద లభించిన గ్రనేడ్లు, ఆహార ప్యాకెట్లు, దుస్తులు, మందులపై పాకిస్థాన్ గుర్తులు ఉన్నాయని ఆయనకు చూపించారు.
అవసరమైతే ఉగ్రవాదుల వేలిముద్రలు, డిఎన్ఏ వివరాలూ ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. దాడికి సూత్రధారులను శిక్షించాలని కోరారు. పాకిస్థాన్ నియంత్రిత భూభాగంలో భారత్ పై ఉగ్ర దాడికి పాల్పడే ఎవ్వరికీ అనుమతి ఇవ్వవద్దనే నిబంధనకు తమ దేశం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా బాసిత్ వెల్లడించినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
#UriAttack Foreign Secretary Jaishankar summons Pakistan High Commissioner Basit to MEA
— Vikas Swarup (@MEAIndia) September 21, 2016
We demand that Pakistan lives up to its public commitment to refrain from supporting & sponsoring terrorism against India #UriAttack pic.twitter.com/fytV5fcgl2
— Vikas Swarup (@MEAIndia) September 21, 2016