యూరీ ఉగ్రదాడి: నిచ్చెన సాయంతోనే వచ్చారు!
శ్రీనగర్/న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన యూరీ ఉగ్రదాడికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రదాడికి పాల్పడిన నలుగురు పాకిస్థానీ తీవ్రవాదులు నిచ్చెనల సాయంతో నియంత్రణ రేఖకున్న విద్యుత్ కంచెను సురక్షితంగా దాటగలిగారు. భారతసైన్యం నిర్వహించిన దర్యాప్తులో తాజాగా ఈ విషయాలు వెలుగుచూశాయి.
కాశ్మీర్లోని సలామాబాద్ నాలా సమీపంలో ఓ చోట విద్యుత్ కంచెకు ఉన్న కొద్దిపాటి స్థలంలో నుంచి ఓ తీవ్రవాది ముందుగా దూరి భారత భూభాగంలోకి చొరబడ్డాడు. మిగిలిన ముగ్గురి వీపుల మీదా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, ఆహారం ఉన్న భారీ సంచులు ఉండటంతో వారు ఆ చిన్న స్థలంలో నుంచి దూరి రాలేకపోయారు. ఈలోగా పాక్ వైపు నుంచి అందించిన నిచ్చెనను ఇటువైపున్న తీవ్రవాది తీసుకున్నాడు. దానిని భారత భూభాగంలో కంచెకు చేరువగా నిలబెట్టాడు.
అవతలి వైపున ఉన్న ఉగ్రవాదులు, సహాయకులు మరో నిచ్చెనను అటువైపున నిలబెట్టారు. కంచెకు తగలకుండా ఈ రెండు ఒకదానికొకటి అనేలా చేసి నిచ్చెనల మీదుగా అవతలి తీవ్రవాదులు ఇవతలికి వచ్చేశారు. ఓ వైపు భారత సైన్యం ముమ్మరగస్తీ.. మరోవైపు ఏ మాత్రం పొరబాటు చేసినా విద్యుదాఘాతం తప్పనిస్థితి మధ్య పాక్ తీవ్రవాదులు ప్రాణాలకు తెగించి కంచెదాటారు. అందుకు, వారికి చాలా సమయమే పట్టి ఉంటుందని భారత సైనిక వర్గాలు విశ్లేషించాయి.
అత్యంత జాగ్రత్తగా నిచ్చెనల మీద నుంచి నలుగురూ భారత భూభాగంలోకి చేరుకున్నారు. ఆ తర్వాత అటువైపున ఉన్న మహమ్మద్ కబీర్ అవాన్, బషారత్ అనే సహాయకులకు ఇక్కడున్న నిచ్చెనను అందించేశారు. అయితే, తీవ్రవాదులు వెంటనే సైనిక శిబిరంపై విరుచుకుపడలేదనీ.. పరిసర గ్రామాల్లో ఎక్కడో ఆశ్రయం పొంది ఉంటారనీ సైనిక వర్గాలు అనుమానిస్తున్నాయి.
అందుకే, సరిహద్దు గ్రామాలైన గొహల్లన్, జబ్లా గ్రామాల్లో భారత సైన్యం విచారణ నిర్వహిస్తోంది. మరో గ్రామమైన సుఖ్దర్లో తీవ్రవాదులు సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి తలదాచుకుని ఉండవచ్చనే అనుమానాలున్నాయి. ఈ గ్రామంలో ఎక్కడ నుంచి చూసినా యూరీ సైనిక స్థావరం చక్కగా కనిపిస్తుంది. భారత సైనికుల కదలికలూ స్పష్టంగా తెలుస్తాయి.
అంతేగాక, దాడి తీరు చూస్తే... తీవ్రవాదులకు యూరీ సైనిక శిబిరం లేఔట్ స్పష్టంగా తెలుసనిపిస్తోంది. ముందుగా వారు ఈ శిబిరం వంటింటికి తాళంపెట్టేశారు. సరుకులు నిలవచేసే గదికి కూడా వెలుపలి వైపు నుంచి గొళ్లెం పెట్టేశారు. దీంతో, లోపలున్న సైనికులకు వెలుపలికెళ్లే మార్గాలన్నిటినీ దాదాపుగా మూసివేసినట్లయిందని దర్యాప్తు నిర్వహిస్తున్న వర్గాలు వెల్లడించాయి. యూరీ దాడిలో 20మంది సైనికులు చనిపోగా, దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులు భారత ఆర్మీ చేతిలో హతమైన విషయం తెలిసిందే.