ఇదో నిరసన: ఉర్జిత్ పటేల్ రాజీనామాపై రఘురామ్ రాజన్ స్పందన
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై రాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రాజీనామా నిరసనగా ఆయన అభిప్రాయపడ్డారు.
షాకింగ్: ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ రాజీనామా, కొద్ది రోజులుగా ప్రభుత్వంతో ఢీ
ఉర్జిత్ పటేల్ రాజీనామా భారతీయులందరికి ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఈ రాజీనామా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక అని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఆర్బీఐతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ రాజీనామా నిరసన చర్యగా భావించవచ్చునని చెప్పారు.
ఉర్జిత్ పటేల్ హయాంలోనే కేంద్రం నోట్ల రద్దు చోటు చేసుకుంది. ఉర్జిత్ కంటే ముందు రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. ఇప్పుడు ఉర్జిత్ పటేల్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఆయన సోమవారం హఠాత్తుగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తదితరులు స్పందించారు.