ఢిల్లీ హై అలర్ట్: లష్కరే దాడులు, భారత్కు 'అమెరికా' హెచ్చరిక
న్యూఢిల్లీ: పాకిస్ధాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్న లష్కరే ఇ తోయిబా తీవ్రవాద సంస్ధ ఢిల్లీలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని భారత్ను అమెరికా హెచ్చరించింది. దీంతో దేశ రాజధానిలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇంటిలిజెన్స్ అధికారులతో కలిసి ఢిల్లీ పోలీసులు రాజధానిలో పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. దాడులు జరిగే అవకాశాలున్నాయని చెప్పిన అమెరికా నిఘా వర్గాలు... ఏ ప్రాంతంలో, ఏ సమయంలో అన్న విషయంలో స్పష్టంగా చెప్పలేదు.
ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులతో ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఉగ్రవాద దాడులను అరికట్టేందుకు చర్యలను చేపట్టారు. అమెరికా నిఘా వర్గాల నుంచి ఈ విషయం తెలియడంతో పలు మార్లు ఇంటిలిజెన్స్ వర్గాలతో ఢిల్లీ పోలీసులు సమావేశమయ్యారు.
ఈ విషయంలో ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదని భావిస్తున్న పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో తీసుకున్న చర్యలపై పోలీస్ కమిషనర్ బిఎస్ బస్సీ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్కు నివేదికను అందిస్తున్నారు.
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న రిపబ్లిక్ దినోత్సవాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ ఆ దేశం నుంచి హెచ్చరికలు రావడంతో కేంద్ర హోం శాఖ కూడా ఈ విషయాన్ని సీరియస్ గానే పరిగణిస్తోంది.