కెవిపి అరెస్టుకి రంగం సిద్ధం: రెడ్ కార్నర్ నోటీసు జారీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా సమాచారం. కెవిపి అరెస్టుకు సంబంధించి భారత ప్రభుత్వంతో అమెరికా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పిటిఐ వార్తాకథనం పేర్కొంటోంది. మనీలాండరింగ్ కేసులో, టైటానియం కుంభకోణం కేసులో కెవిపి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
మరోవైపు కెవిపికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోందని ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. హైదరాబాదు పోలీసులకు సిబిఐ రెడ్ కార్నర్ నోటీసును ఫార్వర్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. టైటానియం కేసులో కెవిపితో సహా ఆరుగురిపై అమెరికా కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. కెవిపితో పాటు అండ్రాస్ నోప్, సురేన్ గోవర్జియన్, గజేంద్ర లాల్, పెరియ స్వామిలు ఉన్నారు.
సిఐడి అధికారులే చెప్పాలి: సిబిఐ
రాజ్యసభ సభ్యుడు అయినా కెవిపి అరెస్టు తప్పదని సిబిఐ అధికార ప్రతినిధి కంచన్ ప్రసాద్ చెప్పారు. కెవిపి అరెస్టు ఎప్పుడన్నది సిఐడి అధికారులే చెప్పాలని ఆయన చెప్పారు.
ప్రమాణ స్వీకారం చేసిన కెవిపి
కెవిపి రామచంద్ర రావు ఢిల్లీలోనే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటే అరెస్టు తప్పుతుందేమోననే ఉద్దేశ్యంతో ఉదయం పదకొండు గంటలకు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల అంతర్జాతీయంగా టైటానియం కుంభకోణం సంచలనం సృష్టించింది. ఇందులో కెవిపి రామచంద్ర రావు పేరు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. టైటానియం కుంభకోణానికి సంబంధించి అంతర్జాతీయంగా పలు పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టైటానియం కుంభకోణంపై కెవిపి కూడా అప్పుడే స్పందించారు.
టైటానియం మైనింగ్ కుంభకోణంలో షికాగో న్యాయస్థానం తనపై అభియోగాలు మోపడంపై కెవిపి స్పందిస్తూ... తనపై ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసులు అందలేదని ఇరవై రోజుల క్రితం చెప్పారు. దర్యాప్తు సంస్థ తన నివేదికను బయటపెట్టాలని కోరారు.
అమెరికా న్యాయ విభాగం, దర్యాప్తు సంస్థ నివేదిక అందాక మాట్లాడతానని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన హృదయంలోనే ఉన్నారని, తాను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనని ఆయన చెప్పారు. నిరాధార ఆరోపణలపై తాను వ్యాఖ్యానించనని, వివరాలు అందాక తన అభిప్రాయం చెబుతానని అన్నారు.