భారత్కు భంగపాటు : చివరి నిమిషంలో చేతులెత్తేసిన అమెరికా.. డీల్స్ లేనట్టేనా?
అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య భారీ వాణిజ్య ఒప్పందాలు కుదురుతాయన్న చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వర్గాలు కూడా ఆ దిశగా సంకేతాలిచ్చాయి. అటు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్తో బిగ్ డీల్కి అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఈ పర్యటనలో ఒప్పందాలపై సంతకాలు కాకపోవచ్చునని కూడా చెప్పారు. అయితే పరిమిత వాణిజ్య ఒప్పందం ద్వారానైనా భారత్-అమెరికా సంబంధాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఇరు దేశాలు భావించాయి. కానీ చివరి నిమిషంలో అమెరికా నుంచి భారత్కు భంగపాటు తప్పలేదు.
చివరి నిమిషంలో పక్కనపెట్టిన అమెరికా..
అమెరికా-భారత్ మధ్య మినీ డీల్ కోసం ఇరు దేశాల అధికారులు గత కొన్ని వారాలుగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చివరి నిమిషంలో అమెరికా తన వైఖరి మార్చుకుంది. భారత్తో భారీ ప్రతిష్టాత్మక ఒప్పందాలు చేసుకోవాలని,ఇలాంటి చిన్న డీల్స్ని పక్కనపెట్టాలని నిర్ణయించింది. అయితే ఆ భారీ ఒప్పందాలు ఎప్పుడు.. ఏ రంగంలో అన్న దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు.
ఇరుదేశాలు ఏం కోరుకుంటున్నాయి..
గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలపై టారిఫ్లకు సంబంధించి ఇరు దేశాలు భిన్నాభిప్రాయంతో ఉన్నాయి. టారిఫ్లను తగ్గించడంతో పాటు మార్కెట్ విస్తృతి పెంచుకునే అవకాశాలపై ఇరు దేశాలు ఫోకస్ చేశాయి. ఈ క్రమంలో భారత మార్కెట్లోకి వస్తున్న అమెరికా మెడికల్ డివైస్లపై టారిఫ్ పరిమితులను సడలించాలని అమెరికా కోరుతోంది. అదే సమయంలో సార్వత్రిక ప్రాధాన్యత వ్యవస్థ(GSP) నుంచి భారత్ను అమెరికా తొలగించడంపై మనదేశం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జీఎస్పీలో భారత్ను వెంటనే పునరుద్దరించాలని కోరుతోంది.
యూఎస్ వర్గాలు ఏమంటున్నాయి..
అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలపై యూఎస్ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు. భారత్తో వాణిజ్య సంబంధాలు అమెరికాకు చాలా కీలకం అని,అదే సమయంలో భారత్కు కూడా అమెరికాతో వాణిజ్యం కీలకమని వ్యాఖ్యానించారు.కాబట్టి ఇరు దేశాలు ఈ విషయంలో సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వీటితో పాటు ఇంకా అనేక అంశాలపై ట్రంప్ తాజా పర్యటనలో భారత ప్రధాని మోదీతో మాట్లాడుతామని చెప్పారు. పర్యటన ముగిసిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య ఈ చర్చలు కొనసాగుతాయన్నారు.
ఆ మూడు రంగాలపై చర్చించే అవకాశం..
మోదీతో భేటీలో స్వదేశీ భద్రతతో పాటు ఇంధన మరియు రక్షణ రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై ట్రంప్ మోదీతో చర్చించే అవకాశం ఉంది. కాగా, సోమవారం ఉదయం 11గంటలకు ట్రంప్ ఆయన భార్య మెలానియా,కుమార్తె ఇవాంకా,అల్లుడు కుష్నర్లతో కలిసి అహ్మదాబాద్లో ఎయిర్పోర్టులో అడుగుపెట్టనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. మోదీ-ట్రంప్ రోడ్ షో సందర్భంగా దాదాపు లక్ష మంది జనం రోడ్డుకు ఇరువైపులా నిలబడి వారికి స్వాగతం పలకనున్నారు.