భారత్-చైనా సరిహద్దులో టెన్షన్.. డ్రాగన్ దూకుడుపై అమెరికా ఫైర్
ప్రపంచమంతా కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతోండగా, వైరస్ పుట్టినిల్లయిన చైనా మాత్రం పొరుగు దేశాల సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తున్నది. ఇండియా భూభాగంలోకి సైనికుల్ని పంపడంతోపాటు యుద్ధ హెలికాప్టర్లతో చక్కర్లు కొట్టిస్తున్నది. అటు దక్షిణ చైనా సముద్రంలోనూ విన్యాసాలు ప్రదర్శిస్తూ అక్కడి దేశాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నది. చైనా అనుసరిస్తున్న తీరుపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. భారత్ సహా బాధిత దేశాలకు మద్దతు పలికింది.
దక్షిణ చైనా సముద్రంగానీ, భారత సరిహద్దులోగానీ చైనా వ్యవహరిస్తున్న తీరు కలవరపరుస్తున్నదని, పొరుగు దేశాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోన్న డ్రాగన్.. తన శక్తిని చూపించుకోవాలని తాపత్రయపడుతున్నట్లుగా కనిపిస్తున్నదని అమెరికా విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి, సౌత్, సెంట్రల్ ఏషియా వ్యవహారాల బ్యూరో చీఫ్ ఆలిస్ వేల్స్ అన్నారు.
చైనా దూకుడుకు కళ్లెం వేయడానికే.. ఆసియాలో సారూప్య భావజాలం కలిగిన దేశాలతో అమెరికా కలిసి నడుస్తున్నదని, అమెరికా, జపాన్, ఇండియాతో కూడిన త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేశామని, ఇదే క్రమంలో మరిన్ని కూటములూ ఏర్పాటు చేస్తామని ఆలిస్ తెలిపారు. కూటమిలోని దేశాలతో తగువులు పెట్టుకోకుండా చైనాను నిలువరించేందుకు గట్టిగా ప్రయత్నిస్తామన్నారు.
ఈ నెల ప్రారంభంలో.. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, సిక్కింలోని సరిహద్దుల్లోని లఢఖ్, ఉత్తర సిక్కిం ప్రాంతాల్లో భారత సైన్యాన్ని చైనా రెచ్చగొట్టడం, గొడవకు దిగడం తెలిసిందే. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. ఇదే సమయంలో తూర్పు లఢఖ్ లోకి చైనా హెలికాప్టర్లు కూడా చొచ్చుకొచ్చాయి. అయితే వీటిని భారత బలగాలు తిప్పికొట్టాయి. ఆ సమయంలో భారత్ సుఖోయ్-30 విమానాలను మోహరించింది. ఈ నేపథ్యంలోనే చైనా తీరుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.