మోడీ హవా మరో పదేళ్లు: సాధారణం కాదంటూ అమెరికా నిపుణుల జోస్యం
మనదేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ హవాపై ఇతర దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో దేశంలో ప్రధాని .
వాషింగ్టన్: మనదేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ హవాపై ఇతర దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావంపై అమెరికాకు చెందిన పలువురు రాజకీయ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
2019 మోడీనే విజేత
2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోడీనే విజేతగా నిలుస్తారని అమెరికా నిపుణులు జోస్యం చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూస్తుంటే 2014 లోక్సభ ఎన్నికల ఫలితాలు సాధారణమైనవి కావని తేలినట్లు భారతీయ వ్యవహారాలను పరిశీలించే అమెరికా నిపుణులు తెలిపారు.
ఆ తర్వాత కూడా మోడీ హవానే..
2019 లోక్సభ ఎన్నికల తర్వాత కూడా మోడీ హవానే కొనసాగుతుందని, తర్వాత కూడా ఆయనే దేశాన్ని నడిపిస్తారని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ప్రొఫెసర్ ఆడమ్ జిగ్ఫెల్డ్ అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు బీజేపీకి గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీల అభ్యర్థుల కంటే బీజేనీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని విశ్లేషించారు.
భారీ మెజార్టీ రాకపోయినా..
ఈ ఫలితాలతో 2019 లోక్సభ ఎన్నికల్లో మోడీనే విజేతగా నిలబడతారని సదానంద్ ధూమే అనే మరో రాజకీయ నిపుణుడు తెలిపారు. 2019 ఎన్నికల్లో మోడీకి మెజార్టీ రాకపోయినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని జార్జ్టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇర్ఫాన్ నూరుద్దీన్ తెలిపారు.
ఇప్పట్నుంచే..
2019లో ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు కొంత ప్రభావం చూపవచ్చని అన్నారు. రాజ్యసభలో బీజేపీకి మరిన్ని సీట్లు రాబోతుండటంతో పెండింగ్లో ఉన్న బిల్లులు ఆమోదం పొందుతాయని తెలిపారు. బీజేపీ ఇప్పటికే 2019 ఇప్పటికే దృష్టి సారించిందని చెప్పారు.