భారత విమానాలు సురక్షితం, భద్రతా ర్యాంకింగ్ను పెంచిన అమెరికా
న్యూఢిల్లీ: భద్రతా ప్రమాణాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తూ, ప్రమాదాలకు దూరంగా ఉంటున్న భారత విమానయాన భద్రతా ర్యాంకింగ్ను పెంచుతున్నట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న కేటగిరీ 2 నుంచి కేటగిరీ 1కు మార్చింది.
14 నెలల క్రితం సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదంటూ కేటిగిరీ 2కు మార్చిన విషయం తెలిసిందే. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని లెటర్ రూపంలో భారత వైమానికి శాఖకు అందింది. దీనిపై విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందిస్తూ.. భద్రతా ప్రమాణాల్లో కేటగిరీ 1 కి రావడం సంతోషంగా ఉందన్నారు.
ప్రాథమిక ఏవియేషన్ చట్టం, నిర్దిష్ట ఆపరేటింగ్ నిబంధనలు, రాష్ట్ర పౌర విమానయాన వ్యవస్థలు మరియు విధులు, అర్హత సాంకేతిక సిబ్బంది మరియు వారి శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం, లైసెన్సింగ్, ధ్రువీకరణ లాంటి వాటిపై గత ఏడాది డిసెంబర్లో ఆడిట్ చేసిన అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ భారత భద్రతా ర్యాంకింగ్ను 2కు మార్చింది.
అయితే గత నెలలో చేసిన ఆడిట్లో భారత విమానయానయాన రంగం భద్రతా ప్రమాణాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తూ, ప్రమాదాలకు దూరంగా ఉండటంతో తాజా నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ తాజా నిర్ణయంతో భారత విమానయాన సంస్ధలైన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ అమెరికాతో పాటు ప్రపంచంలోని మరికొన్ని నగరాలకు తమ సేవలను విస్తరించేందుకు మార్గం సుగమమైంది.