భర్త టూర్కు డిఫరెంట్గా: కేజ్రీవాల్తో మెలానియా భేటీ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ముచ్చట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్లో ఏం నడుస్తోందీ.. అంటే ట్రంప్ టూర్ సమాచారమే నడుస్తోందని అనుకోవచ్చు. ప్రస్తుతం అదరి దృష్టీ అగ్రరాజ్య అధ్యక్షుడి పర్యటన మీదే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన గడువు సమీపిస్తున్న కొద్దీ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగంలో హడావుడీ కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో డొనాల్డ్ ట్రంప్.. తన భార్య మెలానియాతో కలిసి మనదేశ గడ్డపై అడుగు పెట్టనున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ట్రంప్ తొలిసారిగా భారత్కు రానున్నారు. దీనితో అద్దిరిపోయేలా స్వాగత సత్కార కార్యక్రమాలను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. గుజరాత్ సహా దేశ రాజధానులను ముస్తాబు చేసింది. ఈ పర్యటన సందర్భంగా ట్రంప్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపాణి, ఇతర పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానుండగా.. దీనికి భిన్నంగా ఆయన భార్య మెలానియా షెడ్యూల్ను రూపొందించారు.
మెలానియా ట్రంప్.. ఢిల్లీ నగర వీధుల్లో తిరగనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించనున్నారు. విద్యార్థులతో ముఖాముఖీ భేటీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసోడియాలను కలుస్తారు. వారితో కలిసి ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తారు. ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలల్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హ్యాపీనెస్ క్లాసుల్లో పాల్గొంటారు మెలానియా. సుమారు గంట పాటు ఆమె విద్యార్థులతో భేటీ అవుతారు.
Recommended Video
మెలానియా పర్యటనను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ తెలిపారు. మూడంచెల భద్రతా వ్యవస్థను కల్పిస్తామని అన్నారు. మెలానియా పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తామని, దీనిపై ముందుగానే ఢిల్లీ ప్రజలను అప్రమత్తం చేస్తామని తెలిపారు. డ్రోన్లతో నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు.