ఢిల్లీలో ఉద్రిక్తతలు: భారత్లోని రాయబార కార్యాలయాలకు అమెరికా భద్రతా హెచ్చరికలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారతదేశంలోని తమ పౌరులకు జాగ్రత్తలు చెప్పింది అమెరికా ప్రభుత్వం. మంగళవారం భారత గణతంత్ర దినోత్సవం, రైతుల ట్రాక్టర్ల ర్యాలీ దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో తిరగకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆమెరికా ప్రభుత్వం ఢిల్లీలోని తమ పౌరులకు జాగ్రత్తలు చెప్పింది. అంతేగాక, భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయాలకు ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది.
హింసాత్మక ఘటనల నేపథ్యంలో పంజాబ్, హర్యానాలో అలర్ట్
రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని మెట్రో స్టేషన్లను ఇప్పటికే మూసివేశారు. పలు చోట్ల ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తొలగించారు. ఎర్రకోట ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. పార్లమెంటు, విజయ్ చౌక్, రాజ్ పథ్, ఇండియా గేట్ వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు.
రైతులు అనుమతించిన మార్గాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ర్యాలీలు నిర్వహించి విధ్వంసానికి పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. రైతుల దాడుల్లో అనేక మంది పోలీసులు గాయాలపాయ్యారని చెప్పారు. తప్పని పరిస్థితుల్లోనే కొన్ని ప్రాంతాల్లో లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ర్యాలీ సందర్భంగా ఓ రైతు ట్రాక్టర్ బోల్తా కొట్టి చనిపోతే.. పోలీసులు కాల్చి చంపారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితులపై అధికారులతో చర్చించారు. మంగళవారం ఉదయం నుంచి జరిగిన పరిణామాలను అధికారులు హోంమంత్రికి వివరించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కేంద్రమంత్రి అమిత్ షా సూచించారు.
దేశ రాజధానిలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video