అమెరికా చట్టసభల్లో కొత్త బిల్లు: ఇక్కడ చదివి మాదేశానికే పని చేయాలనుకుంటేనే వీసా మంజూరు
అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఆ ప్రభావం ఇతర రంగాలపై కూడా పడుతోంది. తాజాగా చైనా మిలటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనుబంధంగా నడిచే ఇంజినీరింగ్ కాలేజీలు, సైంటిఫిక్ కాలేజీల జాబితాను కోరుతూ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లలో తీర్మానం ప్రవేశ పెట్టారు ప్రజాప్రతినిధులు. ఇంతకీ ఈ బిల్లు దేనికోసం ప్రవేశపెట్టారు... అమెరికా ప్రభుత్వం ఎలాంటి కొత్త చట్టం తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది...?
కొత్త బిల్లుతో చైనాకు చుక్కలు చూపించనున్న ట్రంప్
అమెరికా చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతవారమే చైనా ఉత్పత్తులపై సుంకం పెంచుతామని అమెరికా అధ్యక్షుడు నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిస్థితులు మరింత వేడెక్కాయి. చైనా కూడా ఏమాత్రం తగ్గమని తెగేసి చెప్పాయి. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తమ టెక్నాలజీ వినియోగించుకుని అమెరికానే భయపెడదామని చైనా అనుకుంటే ఆ పప్పులు ఉడకవని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇక తాజాగా చైనాకు మరోదారిలో చుక్కలు చూపించేందుకు ట్రంప్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది.
చైనా మిలటరీ అనుబంధ విద్యా సంస్థల జాబితా ఇవ్వండి
చైనా మిలటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అనుబంధంగా ఏవైతే మిలటరీ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, సైంటిఫిక్ కాలేజీలు ఉన్నాయో వాటి జాబితాను తయారు చేయాల్సిందిగా చట్టసభ ప్రతినిధులు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అనుబంధంగా ఉన్న విద్యాసంస్థల్లో చదువుకుని అమెరికాలో పనిచేయాలనుకునే వారికి చెక్ పెట్టాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. స్టూడెంట్ వీసా కానీ , రీసెర్చ్ వీసాలను వారికి మంజూరు చేయకుండా ఉండేలా చట్టం చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సెనేటర్లు టామ్ కాటన్, చక్ గ్రాస్లే, టెడ్ క్రూజ్, మార్ష బ్లాక్బర్న్, జోష్ హాలే, మార్కో రూబియోలు సెనేట్లో బిల్లును ప్రవేశ పెట్టగా... మైక్ గల్లాగర్, విక్కీ హార్ట్జ్లర్లు హౌజ్లో బిల్లును ప్రవేశపెట్టారు. చైనాకు చెందిన మిలటరీ సైంటిస్టులు అమెరికా టెక్నాలజీ ఇతర పాశ్చాత్యదేశాల టెక్నాలజీపై పట్టు సాధించి తమకే ప్రమాదకరంగా మారే అవకాశముందని తెలిపారు.
గతంలో
అమెరికాలో చదువుకుని ఇక్కడి టెక్నాలజీని దోచేస్తున్నారు గణాంకాలను పరిశీలిస్తే పీపుల్ లిబరేషన్ ఆర్మీ 2500 మంది ఇంజనీర్లను, సైంటిస్టులను విదేశాల్లో చదువుకునేందుకు పంపిందని ఈ సెనేటర్లు తెలిపారు. కొన్ని సందర్భాల్లో చైనా మిలటరీతో తమకున్న అనుబంధాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచారని ఆరోపించారు. ఇక్కడి టెక్నాలజీపై పట్టు సాధించి చైనా మిలటరీకి అందిస్తున్నారని దీంతో అమెరికాకే ప్రమాదంగా మారే అవకాశం ఉందని సెనేటర్లు అభిప్రాయపడ్డారు. ఇది అమెరికా దేశభద్రతకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. ఈ బిల్లు తీసుకురావడంతో చైనా ఆర్మీ అనుబంధ సంస్థల్లో చదివే విద్యార్థులకు అమెరికా యూనివర్శిటీల్లో చదివేందుకు అవకాశం ఉండదని దీంతో దేశభద్రత ప్రమాదంలో పడకుండా సురక్షితంగా ఉంటుందని చెప్పారు.
అమెరికా టెక్నాలజీతో చైనా ఆర్మీ బలపడుతోంది
ఈ బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాలిస్తే చైనా మిలటరీ అనుబంధ సంస్థల నుంచి తమ యూనివర్శిటీలను కాపాడుకోగలుగుతామని కాంగ్రెస్ నేత హార్ట్జ్లర్ తెలిపారు. చైనా మిలటరీతో సంబంధం లేకుండా అసలు వారి నిజస్వరూపాలు ఎవ్వరికీ చెప్పకుండా అమెరికాలోని టాప్ యూనివర్శిటీల్లోకి విద్యార్థులను చైనా లిబరేషన్ ఆర్మీ తరలిస్తోందని సభ్యులు ఆరోపించారు. అమెరికా కాలేజీలు టెక్ కంపెనీల సమాచారం, టెక్నాలజీతో చైనా ఆర్మీ బలపడుతోందని ఇది జరగకుండా ఉండాలంటే ముందుగా అమెరికా రీసెర్చ్ లాబొరేటరీల్లో పనిచేస్తున్న చైనా పరిశోధకులను తొలగిస్తే భద్రతాపరంగా కాస్త సేఫ్ సైడ్లో ఉంటామని సభ్యులు చెప్పారు. విదేశీయులు తమ యూనివర్శిటీల్లో చదివి అమెరికా అభివృద్ధి కోసం పాటుపడేవారికే స్టూడెంట్ మరియు రీసెర్చ్ వీసాలు జారీ చేయాలని వారు అన్నారు. అంతే తప్ప ఇక్కడ చదవి ఆ టెక్నాలజీని తమ సొంత దేశాలకు వినియోగించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. దీన్నే చైనా అలుసుగా తీసుకుందని ఇకపై అలా జరగబోదని చెప్పారు.