వికీలీక్స్ సంచలనం: బీజేపీపై అమెరికా నిఘా!, పాక్ మొబైల్ నెట్వర్క్ హ్యాక్
ప్రపంచవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలపై ఫోకస్ పెట్టిన అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) మనదేశంలో బీజేపీపై నిఘా పెట్టినట్లు వెల్లడించింది.
న్యూఢిల్లీ: సంచలనాలకు కేంద్రబిందువైన వికీలీక్స్ తాజాగా మరో సంచలన వార్తను బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలపై ఫోకస్ పెట్టిన అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) ఇండియాలో బీజేపీపై నిఘా పెట్టినట్లు వెల్లడించింది.
పాకిస్తాన్ కు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)పై కూడా ఎన్ఎస్ఏ నిఘా పెట్టినట్లు వికీలీక్స్ వెల్లడించింది. అంతేకాదు, పాకిస్తాన్ లోని పలు మొబైల్ నెట్ వర్క్ లను కూడా అమెరికా హ్యాక్ చేసిందని వికీలీక్స్ వెల్లడించడం గమనార్హం.
అయితే అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీ ఇలా విదేశీ రాజకీయ పార్టీలపై నిఘా పెట్టడం ఇదే తొలిసారి కాదు. ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. ఫారిన్ ఇంటలిజెన్స్ సర్వైలెన్స్ యాక్ట్(ఫిసా-అమెరికా ప్రభుత్వం) ఆదేశాల మేరకే ఈ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
వాషింగ్టన్ పోస్టు వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే.. 2010 ఫిసా కోర్టు సర్టిఫికేషన్ మేరకు ప్రపంచవ్యాప్తంగా 193విదేశీ ప్రభుత్వాలు, సమూహాలు, పొలిటికల్ పార్టీలపై ఎన్ఎస్ఏ నిఘా పెట్టింది. పైగా ఐక్యరాజ్య సమితి, ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు సహా తదితర సంస్థలపై కూడా నిఘా పెట్టడానికి ఎన్ఎస్ఏ అనుమతి కలిగి ఉండటం గమనార్హం.