పెద్దన్న వస్తున్నాడు.. ఫిబ్రవరిలో ఇండియాకు ట్రంప్.. అమెరికా అధ్యక్షుడి రాకపై ఎన్నో ఆశలు..
రాజకీయ, వాణిజ్య వర్గాలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తోన్న 'అమెరికా అధ్యక్షుడి ఇండియా పర్యటన' దాదాపు ఖరారైంది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రప్.. ఫిబ్రవరి సెకండాఫ్ లో భారత్ కు వస్తారని, ఆయన టూర్ కు సంబంధించిన అన్ని అంశాలపై రెండు దేశాల మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. అమెరికా దౌత్య అధికారులు కూడా ట్రంప్ ఇండియా టూర్ ని నిర్ధారించినప్పటికీ వైట్ హౌజ్ మాత్రం మౌనం పాటిస్తున్నది.
వచ్చేవారంలో సెక్యూరిటీ టీమ్..
అమెరికా ప్రెసిడెంట్ పర్యటనంటే ఎంత హడావుడి ఉంటుందో మనందరికీ తెలిసిందే. కార్లు, విమానాలు, సెక్యూరిటీ సిబ్బంది, వంటమనుషులు.. అందరూ అమెరికా నుంచే వస్తారు. ట్రంప్ టూర్ నేపథ్యంలో వాషింగ్టన్ నుంచి సెక్యూరిటీ అండ్ లాజిస్టిక్ టీమ్స్ వచ్చేవారమే ఇండియాకు వస్తాయని, ఇక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలిస్తాయని దౌత్యవర్గాలు పేర్కొన్నాయి.
మోడీ రిక్వెస్ట్ తో..
ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలి విదేశీ పర్యటనగా ఇండియాలో ల్యాండ్ అవుతారని భావించినా అలా జరగలేదు. 2018 రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా రావాలిని ట్రంప్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ రిక్వెస్ట్ చేశారు. అప్పుడు కూడా వీలుచిక్కలేదు. గతేడాది మోడీ అమెరికా పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. తొలి టర్మ్ లోనే ఇండియా పర్యటనకు వెళతానని స్పష్టం చేశారు.
మనకేం లాభం?
ఫిబ్రవరిలో ట్రంప్ చేపట్టనున్న ఇండియా పర్యటనలో భాగంగా.. రెండు దేశాల మధ్య పెండింగ్ లో ఉన్న పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండో-యూఎస్ ట్రేడ్ డీల్, ఇండియాకున్న ‘జీఎస్పీ' స్టేటస్ రద్దుపై అమెరికా పునరాలోచన, వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులు, అమెరికా నుంచి ఆయిల్ దిగుమతి తదితర అంశాలపై కీలక చర్చలు జరుగుతాయి. ఇందుకోసం వాణిజ్యవర్గాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.
Recommended Video
ఎక్కడికొస్తారు?
కాగా, ఇండియా పర్యటనలో భాగంగా ట్రంప్ ఏ ప్రాంతానికి వస్తారనేది ఇంకా ఖరారుకాలేదు. న్యూఢిల్లీలోనే దిగుతారా లేక ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలను ఎంపిక చేసుకుంటారా అన్నది వెల్లడికాలేదు. గతేడాది చైనా చైర్మన్ జింగ్ పిన్ తమిళనాడులోని మహాబలిపురంలో మోడీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ట్రంప్ టూర్ లో అలాంటి పదనిసలు ఉంటాయా? లేదా? తెలియాల్సిఉంది.