ట్రంప్ నోట పాక్ మాట...ఇరకాటంలో మోడీ, నేడు కౌంటర్ ఇచ్చేనా..!
న్యూఢిల్లీ: భారత పర్యటనలో భాగంగా తొలిరోజు అహ్మదాబాద్ ఆగ్రాలో పర్యటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా ఆయన మోతెరా క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రసంగించారు. తన ప్రసంగంలో మోడీని ఆకాశానికెత్తేశారు ట్రంప్. ఇంతవరకు బాగానే ఉన్న ఒకే ఒక్క వ్యాఖ్యతో ట్రంప్ కొత్త అనుమానాలను రేకెత్తించారు.
Recommended Video
పాకిస్తాన్పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నమస్తే ట్రంప్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఉగ్రవాదం అణిచివేతకు భారత్తో కలిసి పనిచేస్తామని చెప్పిన ట్రంప్... ఈ విషయంలో పాకిస్తాన్ కూడా ముందుకు రావాలని అన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ అమెరికా దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చేసిన వ్యాఖ్య ప్రధాని మోడీకి కూడా మింగుడు పడలేదు. పాకిస్తాన్ గడ్డపై నుంచే ఉగ్రవాదం ఊపిరిపోసుకుంటోందన్నది బహిరంగ రహస్యమే. అయినప్పటికీ ట్రంప్ పాకిస్తాన్ను వెనకేసుకు రావడం ప్రపంచదేశాలను సైతం షాక్కు గురిచేశాయి.
ఓ వైపు పాక్కు మద్దతు..మరో వైపు భారత్కు స్నేహహస్తం
భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో ట్రంప్ పాకిస్తాన్తో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పడాన్ని భారత్ జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు భారత్తో 3 బిలియన్ డాలర్ల మేరా మిలటరీ ఎక్విప్మెంట్ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.రక్షణ రంగంలో అమెరికాకు భారత్ కీలక భాగస్వామిగా అవతరిస్తుందని ట్రంప్ చెప్పారు.
ట్రంప్ వ్యాఖ్యలతో మోడీ ఇరకాటంలో పడ్డారా..?
ఇక అహ్మదాబాదులోని మోతెర క్రికెట్ స్టేడియంలో జరిగిన సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అమెరికా అగ్రజుడిని పదే పదే స్నేహితుడు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో ట్రంప్ కూడా మోడీని ఆకాశానికెత్తేస్తూ చివరకు పాకిస్తాన్తో అమెరికాకు మంచి సంబంధాలున్నాయని చెబుతూ ఒక్కసారిగా ఉసూరుమనిపించారు. పాకిస్తాన్ అమెరికా దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయని పాక్ సరిహద్దులో ఉగ్రవాదం అణిచివేతకు కలిసి పనిచేస్తామని ట్రంప్ చెప్పారు. అంతేకాదు పాకిస్తాన్తో భవిష్యత్తులో కలిసి పనిచేస్తామని ట్రంప్ చెప్పారు. ఇక ఈ రోజు జరగనున్న ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోడీ ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ట్రంప్ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని భారత్
భారత గడ్డపై నుంచి పాకిస్తాన్కు మద్దతుగా ట్రంప్ మాట్లాడటాన్ని భారత్ జీర్ణించుకోలేకపోతోంది.రెండు దేశాల మధ్య సంబంధాలు దాదాపు చెరిగిపోయాయి.కశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా విబేధాలు ఉన్నాయి. ఇక దేశంలో ముస్లిం సామాజిక వర్గం వారు సీఏఏకు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, యూదాల మధ్య విబేధాలు లేకుండా అంతా సోదరభావంతో కలిసి ఉంటున్న దేశం భారత్ అని రెండు సార్లు చెప్పుకొచ్చారు.