ఇండియాలో పేదరికంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ‘నమస్తే ట్రంప్’లో ఏం చెప్పారంటే..
రెండ్రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోమవారం మోతేరా స్టేడియంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్'కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. 1.25లక్షల మందితో తనకు ఆతిథ్యం పలకడం ఆనందంగా ఉందన్న ఆయన.. మోదీ పాలనపై ప్రశంసలజల్లు కురిపించారు. అదేసమయంలో ఇండియాలోని పేదరికంపైనా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోతేరా స్టేడియంలో ట్రంప్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
Recommended Video
ఇదే నా వాగ్ధానం..
‘‘నమస్తే.. నమస్తే.. అందరికీ నమస్కారం. ఇది నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవం. నాకీ అవకాశాన్ని కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఫస్ట్ లేడీతో కలిసి దాదాపు 8వేల మైళ్లు ప్రయాణించి మీదగ్గరికొచ్చాను. మీతో ఒక ముఖ్యమైన విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ఇండియా పట్ల అమెరికా సర్వదా ప్రేమను కలిగి ఉంటుంది.. ఎప్పటికీ ఈ దేశాన్ని గౌరవిస్తుంది.. కలకాలం మీకు నమ్మకంగా కలిసుంటుంది.. ఇది భారతీయులకు నేను చేస్తున్న వాగ్ధానం.
గౌరవం పెరిగింది..
ఐదు నెలల కిందట ప్రియమిత్రుడు మోదీతో కలిసి టెక్సాస్ లో ‘హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇప్పుడీ అహ్మదాబాద్ సిటీలో.. ప్రపంచంలోనే అతిపెద్దదైన క్రికెట్ స్టేడియంలో లక్షలాది మంది ముందు మాట్లాడుతుండటం ఆనందంగా ఉంది. మోతేరా స్టేడియం చాలా చాలా అందంగా ఉంది. ఇక్కడికొచ్చిన అందరికీ అభినందనలు. ఇండియాలోని భిన్నసంస్కృతులు ప్రతిబింబించేలా, సుమారు 1.25లక్షలమందితో నాకు స్వాగతం పలికిన తీరు నిజంగా అమోఘం. నేను, నా ఫ్యామిలీ ఈ ఆతిథ్యాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం. ఇవాళ్టి నుంచి మా అందరి గుండెల్లో ఇండియా గౌరవం మరింత పెరిగింది.
నాయకుడంటే మోదీనే..
ఇండియా ఇక్కడి ప్రజలకు ఏమిస్తుందనడానికి ప్రధాని మోదీ జీవితమే పెద్ద ఉదాహరణ. పేద కుటుంబంలో పుట్టి ‘చాయ్ వాలా'గా జీవితాన్ని ప్రారంభించారాయన. యువకుడిగా ఉన్నప్పుడు.. ఇదే అహ్మదాబాద్ లోని దుకాణంలో హెల్పర్ గా పనిచేశారు. మోదీని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. కానీ ఆయన చాలా టఫ్ అని చెప్పకతప్పదు. ఇండియాలో శక్తిమంతమైన నేతగా మోదీ ఎదిగారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో రెండోసారి విజయం సాధించారు. భూగోళంమీద ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నడూ చూడనంత గొప్ప విజయం ఆయనది. మోదీగారూ.. మీరు కేవలం గుజరాత్ కు మాత్రమే గర్వకారణం కాదు.. భారతీయులు దేన్నైనా సాధించగలరని చెప్పడానికి సజీవ ఉదాహరణ మీరు. మోదీని, ఇండియాను మేం గర్వకారణంగా భావిస్తున్నాం.
పదేళ్లలో పేదరికం గాయబ్..
గడిచిన కాలంలో భారత్ సుమారు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకురాగలగడం అరుదైన విజయమనే చెప్పాలి. మోదీ నాయకత్వంలో తొలిసారి.. దేశమంతటికీ కరెంట్ సరఫరా అవుతుండటం విశేషం. 32కోట్ల పైచిలుకు ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. గృహనిర్మాణం, హైవేల నిర్మాణం, ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్, టాయిలెట్ల సౌకర్యం తదితర పనులు మునుపటికంటే వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ ప్రతి నిమిషం దేశంలో ఏదో ఒక మూలన ప్రజలు పేదరికం నుంచి బయటికి తేబడున్నారు. వచ్చే పదేళ్లలో.. ఇండియా నుంచి పేదరికం పూర్తిగా రూపుమాసిపోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మిడిల్ క్లాస్ కుటుంబ వ్యవస్థగా అవతరించబోతున్నది.
మానవత్వానికి ఇండియా చేయూత..
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతినిధిగా, సుదీర్ఘమైన ప్రజాస్వామిక చరిత్ర కొనసాగిస్తూ, అందరూ గొప్పవాళ్లున్న దేశంగా ఇండియా చరిత్ర చాలా ప్రత్యేకమైనది, భిన్నమైనది కూడా. ఈ భూమ్మీద మానవత్వం అనే భావనకు నమ్మకంగా నిలబడింది ఇండియానే. స్వాతంత్ర్యం తరువాత కేవలం 70 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించింది. గొప్పదేశంగా నిలబడింది.
బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుదాం..
ఇండియా ఎదుగుతున్న తీరు.. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ శతాబ్దికి భారత ప్రగతే చర్చనీయాంశం. ప్రజాస్వామిక, శాంతియుత, సహనశీల, స్వేచ్ఛాయుత దేశంగా ఇండియాను నిలబెట్టడంలో మోదీ సక్సెస్ అయ్యారు. కలల్ని సాధించేవాళ్లుగా తన ప్రజల్ని తయారుచేయడంలో ప్రపంచంలోని ఇతర దేశాలకంటే ఇండియానే ముందుంది. గత 70 ఏళ్లలో.. సమాజం స్వేచ్ఛాయుతంగా జీవించడం, సాటి పౌరుల పట్ల గౌరవమర్యాదలతో వ్యవహరించడం, డిగ్నిటీని కాపాడుకోవడం తదితర అంశాల్లో సారూప్యత కారణంగానే ఇండియా-అమెరికా సహజ మిత్రులయ్యాయి.