మాల్దీవుల్లో ఎమర్జెన్సీ: మోడీకి ట్రంప్ ఫోన్, ఏం మాట్లాడారంటే..?
వాషింగ్టన్/న్యూఢిల్లీ: మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురించి వైట్ హౌస్ వెల్లడించింది.
ఎమర్జెన్సీలో మాల్దీవులు: చీఫ్ జస్టిస్ అరెస్ట్, కొనసాగుతున్న ఉద్రిక్తత
మాల్దీవుల్లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్హౌస్ పేర్కొంది. ప్రజాస్వామ్య సంస్థలు, చట్టపరమైన పాలనను గౌరవించాల్సిన అవసరం ఉందని నేతలు స్పష్టం చేసినట్లు తెలిపింది.
15రోజులపాటు ఎమర్జెన్సీ
మాల్దీవులు అధ్యక్షుడు యమీన్.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి 15రోజులపాటు అత్యవసర పరిస్థితి ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు మరో న్యాయమూర్తిని కూడా అరెస్ట్ చేయించారు.
సుప్రీం సీజే, మాజీ దేశాధ్యక్షుడి అరెస్ట్
అంతకుముందే మాజీ దేశాధ్యక్షుడు గయూంను కూడా యమీన్ అరెస్ట్ చేయించారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, పార్టీ మారిన ఎంపీల సభ్యత్వాలను పునరిద్ధరించడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను యమీన్ నిరాకరించిన విషయం తెలిసిందే.
ఎమర్జెన్సీ అంశంపై ఫోన్
ఈ నేపథ్యంలో ట్రంప్.. మోడీకి ఫోన్ చేసి మాల్దీవుల ఎమర్జెన్సీ అంశంతోపాటు ఇతర అంశాలపై మాట్లాడారు. మయన్మార్ అంశం, రోహింగ్యా శరణార్థుల గురించి కూడా చర్చించారు.
ఉత్తరకొరియాపైనా చర్చ
ఉత్తరకొరియా అణ్వస్త్ర ప్రయోగాల గురించి, ఉ. కొరియాను అణ్వాయుధాల విషయంలో నియంత్రించగలిగే అంశంపై మోడీ, ట్రంప్ చర్చించారు. ఆఫ్ఘనిస్థాన్ భద్రత విషయంలో సహకారానికి కట్టుబడి ఉన్నామని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపినట్లు వైట్ హౌస్ పేర్కొంది.