చదువులో టాపర్.. రూ.3.80కోట్లు స్కాలర్షిప్కి ఎంపిక... ఈవ్ టీజింగ్కి బలి..
ఉత్తరప్రదేశ్లోని గౌతమబుద్ద నగర్ జిల్లా దాద్రిలో దారుణం జరిగింది. చదువుల్లో మేటిగా పేరు తెచ్చుకున్న ఓ యువతి ఈవ్ టీజింగ్కు బలైపోయింది. అయితే పోలీసులు మాత్రం ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చెబుతుండటం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాకు చెందిన సుదీక్షా భాటి(20)కి చిన్నతనం నుంచి చదువుపై అమితమైన ఆసక్తి. 2018లో సీబీఎస్సీ క్లాస్ 12 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 98 శాతం మార్కులు సాధించడంతో అమెరికాలోని మసాచుసెట్స్లో గల బాబ్సన్ కాలేజ్లో స్కాలర్షిప్కు అర్హత సాధించింది.
అప్పటినుంచి అమెరికాలోనే చదువు కొనసాగిస్తున్న ఆమె... ఇటీవల కరోనా వైరస్ కారణంగా భారత్కు తిరిగి వచ్చింది. సాధారణ పరిస్థితులు నెలకొంటే అగస్టులో తిరిగి అమెరికా వెళ్లాలని భావించింది. అక్కడి కాలేజీలో కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉండగా... వాటి కోసం సోమవారం(అగస్టు 10) తాను చదువుకున్న స్కూల్కు బయలుదేరింది. బంధువుతో కలిసి బైక్పై వెళ్లగా... మార్గమధ్యలో ఇద్దరు పోకిరీలు వారిని ఆటపట్టించారు.
బుల్లెట్ బైక్తో స్టంట్స్ చేస్తూ... హైస్పీడ్తో వారి బైక్ పైకి దూసుకెళ్తూ భయపెట్టించారు. ఇదే క్రమంలో ఆ పోకిరీలు తమ బైక్తో సుదీక్ష ఉన్న బైక్ను ఢీకొట్టారు. దీంతో ఆమె కిందపడిపోగా తలకు బలమైన గాయమై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆమె బంధువు తలకు కూడా గాయాలయ్యాయి. ఆ పోకిరీలు కావాలనే వెంబడించి ఈవ్ టీజింగ్ చేసి తమ కుమార్తెను బలి తీసుకున్నారని సుదీక్ష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే బులంద్ షహర్ పోలీసులు మాత్రం ఇది రోడ్డు ప్రమాదమేనని... ప్రత్యక్ష సాక్షులు కూడా వేధింపుల గురించి ఏమీ చెప్పలేదని అంటున్నారు.
మృతురాలితో పాటు బైక్పై వెళ్లిన ఆమె బంధువు మాట్లాడుతూ... 'మా మేన కోడలు అమెరికాలో చదువుకుంటోంది. హెచ్సీఎల్ ఆమెకు రూ.3.80కోట్లు ఉపకార వేతనం అందిస్తోంది. అగస్టు 20న తిరిగి అమెరికా వెళ్లాలనుకుంది. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది.' అని ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఒక తెలివైన విద్యార్థి ఈవ్ టీజింగ్కి బలైపోవడం బాధాకరం అన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని... నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.