భారత్కు అమెరికా కీలక ఎస్టీఏ హోదా, ట్రంప్ ప్రభుత్వంపై చైనా గుర్రు
బీజింగ్/న్యూఢిల్లీ: వ్యూహాత్మక వాణిజ్య హోదా 1 (స్ట్రాటెజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ 1 - ఎస్టీఏ 1) హోదాను భారత్కు ఇవ్వాలని అగ్రరాజ్యం అమెరికా నిర్ణయించింది. దీనిపై చైనా ఆగ్రహంతో ఉంది. దీంతో అమెరికా మిత్రదేశాలకు ఎలాంటి రాయితీలు వస్తాయో భారత్కు అవే రానున్నాయి.
ఎస్టీయే వల్ల అమెరికా రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చు. నాటో దేశాలతో సమానంగా భారత్కు హోదా లభిస్తుంది. అత్యాధునిక ఆయుధాలతో పాటు పరిజ్ఞానం పొందే సౌలభ్యం ఉంది. దీంతో నూతన ఆయుధ ఆవిష్కరణలను తెలుసుకునే అవకాశముంది.
అయితే డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నదని తెలుస్తోంది. గతంలో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాలుగు బృందాల కూటమిలో తప్పనిసరిగా సభ్యత్వం ఉంటేనే సైనిక ఆయుధాలను విక్రయిస్తామన్న నిబంధనను తీసుకు వచ్చింది. వీటిలో అణు ఇంధన సరఫరాదారుల కూటమిలో తప్ప మిగిలిన మూడింటిలో భారత్కు సభ్యత్వం ఉంది. ఎన్ఎస్జీలో భారత్ ప్రవేశానికి చైనా గట్టిగా అడ్డుచెప్పడంతో మనకు సభ్యత్వం రావడం లేదు.
దీనితో పాటు భారత్, అమెరికా రక్షణ ఒప్పందాలపై ముఖ్యంగా సాంకేతిక బదలాయింపుపై చైనా వ్యతిరేకతతో ఉంది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా ఒత్తిడి వల్లనే భారత్కు నూతన పరిజ్ఞాన బదలాయింపు జరగలేదు. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక చైనాను నిలువరించేందుకు వీలుగా భారత్కు ప్రాధాన్యత ఇస్తున్నారు.