వీడెక్కడి మొగుడురా బాబూ.. భార్యతో గొడవపడి రైలును ఆపాడు..!
చెన్నై : భార్యతో గొడవపడ్డాడు. ఆ కోపంలో ఫుల్లుగా మందేశాడు. అది కాస్తా కైపెక్కడంతో నానా హంగామా చేశాడు. మద్యం మత్తులో రైలు పట్టాలపై రెచ్చిపోవడంతో ట్రైన్ నిలిచిపోయిన పరిస్థితి. ఇదంతా తమిళనాడులో ఓ భర్త చేసిన నిర్వాకం. శనివారం (18.05.2019) నాడు ఈ ఘటన జరిగినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సారు.. కారు.. సరే : మరి ఫ్రంట్ కథ కంచికేనా?
భార్యతో గొడవపడి.. నానా రచ్చ
శివగంగయి జిల్లాలోని ఏనాడి చెంగొట్టకు చెందిన 26 ఏళ్ల షణ్ముగన్ శుక్రవారం (17.05.2019) నాడు భార్యతో గొడవ పెట్టుకున్నాడు. దాంతో పీకలదాకా మద్యం తాగి తన టూ వీలర్ వాహనంపై తిరుభువనం చేరుకున్నాడు. లడనెందల్ రైల్వే ట్రాక్ కింద మందేసి ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. ఇక శనివారం నాడు ఉదయం నానా రచ్చ చేశాడు. రాత్రి తాగింది దిగకపోవడం.. భార్యతో జరిగిన గొడవ గుర్తుకురావడం.. షణ్మగన్కు మరింత పిచ్చెక్కించింది.
రైలు పట్టాలపై తాపీగా బైకు పెట్టి..!
ఆ క్రమంలో బైకును తీసుకెళ్లి రైలు పట్టాలపై నిలిపాడు. ముందు టైరు పట్టాలపై పెట్టి.. దానిపై తాపీగా కూర్చున్నాడు. ఉదయం 7 గంటల 40 నిమిషాల ప్రాంతంలో మధురై నుంచి రామేశ్వరం వెళ్లాల్సిన రైలు ఆ మార్గంలో వచ్చింది. అయితే డ్రైవర్ దూరం నుంచే పట్టాలపై బైక్తో సహా మనిషి ఉన్నాడనే విషయం పసిగట్టి అప్రమత్తమయ్యారు. వెంటనే రైలును ఆపేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.
రైలు ఆగింది.. అరగంట ఆలస్యం..!
ఇంతకు ఆ మనిషి రైలు పట్టాలపై అలా ఎందుకున్నాడోనని ప్రయాణీకులు ఆరా తీశారు. అతడికి నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేదు. దాంతో రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్నారు. అంతలోనే షణ్ముగన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మొత్తానికి అతడి మూలంగా ఆ రైలు దాదాపు అరగంట ఆలస్యంగా నడవడం గమనార్హం. మనామధురై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
ఈ తాగుబోతు మొగుడి కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భార్యతో గొడవపడ్డోడు ఇంకేదో రకంగా ఇంట్లో నిరసన తెలపాలే గానీ.. ఇలా రోడ్లపైకి వచ్చి నానా రచ్చ చేయడమేందిరా నాయనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. భార్యతో కొట్లాడి రైలు ఆపితే అతడికి కలిగిన ప్రయోజనమేంటోనని నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.