అక్కడి కాలేజీ యూనివర్శిటీల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం
ఉత్తర్ ప్రదేశ్: ఇక నుంచి స్కూళ్లకు కాలేజీలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం. ఇదే విషయాన్ని తెలుపుతూ ఉత్తర్ప్రదేశ్ ఉన్నత విద్యామండలి డైరెక్టొరేట్ సర్క్యులర్ జారీ చేసింది. యూనివర్శిటీలు, కాలేజీలు ,స్కూళ్లలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు వినియోగించరాదంటూ ఆ సర్క్యులర్లో పేర్కొంది. ఇది ఒక్క విద్యార్థులకే కాదని బోధన సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని సర్క్యులర్లో ఉంది.
టీచర్లు కూడా మొబైల్ ఫోన్లు వాడరాదు
రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో, కాలేజీల్లో యూనివర్శిటీలో మంచి బోధనతో కూడిన వాతావరణం అలవర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యోగీ సర్కార్ పేర్కొంది. ఇందుకు విద్యార్థులు, బోధన సిబ్బంది సహకరించాలని వెల్లడించింది. ఇక తరగతి గదుల్లో విద్యార్థులు టీచర్లు ఎక్కువ సమయం మొబైల్ చూస్తూ గడిపేస్తున్నారని చెప్పిన ప్రభుత్వం విద్యార్థులు పాఠాలు వినడం లేదని, టీచర్లు మొబైల్ ఫోన్లు చూస్తూ బోధనను గాలికొదిలేసినట్లు తమ వద్దకు ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
అధికారిక సమావేశాలకు కూడా నో సెల్ ఫోన్
ఇప్పటికే సీఎం యోగీ ఆదిత్యనాథ్ కేబినెట్ మీటింగుల్లో కానీ ఇతర అధికారిక సమావేశాల్లో కానీ మొబైల్ ఫోన్లను నిషేధించారు. కేబినెట్ మీటింగుల సందర్భంగా మంత్రులు తమ ఫోన్లలోని వాట్సాప్కు వచ్చే మెసేజ్లపైనే దృష్టి కేంద్రీకరిస్తూ కేబినెట్ అంశాలపై చర్చించడంలో ఆసక్తి కనబరచడం లేదని సీఎం యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. ఇక మొబైల్ ఫోన్లను విద్యార్థులు కాలేజీ క్యాంపస్లకు తీసుకురావడంతో చాలా అనర్థాలు జరిగిపోతున్నాయని ప్రభుత్వం ఇదివరకే హెచ్చరించింది.
విద్యార్థులు విలువైన సమయంను వృథా చేస్తున్నారు
క్లాసులో టీచర్లు చెప్పే పాఠాలు వినడం మానేసి మొబైల్ ఫోన్లలో గేమ్స్ సినిమాలు చూస్తూ విద్యార్థులు విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని అభిప్రాయపడింది. ఇక కొందరు విద్యార్థులైతే ఏకంగా క్యాంపస్లో టిక్టాక్లు చేస్తున్నారని వెల్లడించింది. ఒక వేళ ఎవరైనా క్యాంపస్లో మొబైల్ ఫోన్లతో కనిపిస్తే ముందుగా విద్యార్థి పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఉన్నతవిద్యామండలి తెలిపింది. కాబట్టి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు స్కూళ్లకు, కాలేజీలకు, యూనివర్శిటీలకు సెల్ఫోన్లు తీసుకెళ్లకుండా చూసే బాధ్యత తమదే అని సర్కార్ స్పష్టం చేసింది.