ముందు మోడీని అమెరికాకు ఆహ్వానించండి: ట్రంప్కు టాప్ గ్రూప్ సూచన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్కు టాప్ బిజినెస్ అడ్వయిజరీ గ్రూప్.. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సెల్ (యూఎస్ఐబీసీ) ఓ సూచన చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీని సాధ్యమైంత త్వరగా అమెరికాకు ఆహ్వానించాలని సలహా ఇచ్చింది.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే నరేంద్ర మోడీని అమెరికాకు ఆహ్వానించాలని చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల శుభాకాంక్షలు చెబుతూ అది లేఖ రాసింది. ఈ లేఖలో మోడీని అమెరికాకు ఆహ్వానించాలని సూచించింది.
శ్వేతసౌధంలోకి వెళ్లిన ఏడాదిలోపే మోడీని ఆహ్వానిస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేసినట్లవుతుందని పేర్కొంది. కొత్త వైట్హౌస్ అడ్మినిస్ట్రేషన్ తొలి నెలలో చేయాల్సిన పనులను లేఖలో సూచించారు.
వీటి ద్వారా భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు బలోపేతమవుతాయన్నారు. కాగా, మంగళవారం నాడు అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. బుధవారం నాడు ఫలితాలు విడుదలయ్యాయి. ట్రంప్ గెలిచిన విషయం తెలిసిందే.