విశ్వవిద్యాలయం వసతి గృహాలు ఖాళీ: విద్యార్థులను తరలిస్తున్న అధికారులు
భువనేశ్వర్: మరో 24 గంటలు. అత్యంత ప్రమాదకరంగా రూపుదాల్చిన ఫొణి తుఫాన్ తీరం చేరడానికి ఉన్న గడువు. తీరానికి చేరుకుంటున్న కొద్దీ ఫొణి తుఫాన్ మరింత బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలో ఏర్పడే కల్లోల పరిస్థితులను ఊహించడానికే భయపడుతున్నారు అధికారులు. అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా తట్టుకోవడానికి సన్నద్ధమౌతున్నారు.
విజయనగరం టు భద్రక్: బోసిపోయిన కోస్తా: 103 రైళ్లు రద్దు!
ప్రాణనష్టం తగ్గింపుపై దృష్టి
ముందుగా- వీలైనంత మేర ప్రాణనష్టాన్ని తగ్గించడానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. తుఫాన్ సమయంలో ఆస్తి నష్టాన్ని నివారించడానికి వీలు ఎలాగూ ఉండదనే నిర్ణయానికి వచ్చిన ఒడిశా అధికారులు కనీసం ప్రాణ నష్టాన్ని వీలైనంత వరకు తగ్గంచడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా- ప్రతిష్ఠాత్మక ఉత్కళ విశ్వవిద్యాలయం క్యాంపస్ పరిధిలోని హాస్టళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఏ ఒక్క విద్యార్థి కూాడా హాస్టల్ గదుల్లో ఉండటానికి వీల్లేదంటూ గురువారం ఉదయమే విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా- విద్యార్థులు తమ పెట్టే బేడా సర్దుకుంటున్నారు. స్వస్థలాలకు తిరుగు ముఖం పట్టారు. సుమారు వెయ్యిమంది విద్యార్థుల వరకూ హాస్టళ్లలో ఉంటున్నారని, ప్రస్తుతం వారంతా- తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లడానికి సిద్ధపడ్డారని వర్శిటీ అధికారులు తెలిపారు.
జగన్నాథుని భక్తులను తరలించడానికి ప్రత్యేక రైలు
ఇదిలావుండగా- ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందర్నీ వెనక్కి పంపించేస్తున్నారు అక్కడి అధికారులు. దీనికోసం ప్రత్యేకంగా- రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. పూరీ-కోల్ కత మధ్య ప్రత్యేక రైలును నడిపిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ రైలు పూరీ నుంచి బయలుదేరి వెళ్లింది. ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జైపూర్, కియోంఝర్ రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్ పూర్ లల్లో ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం కల్పించారు.
గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో
కాగా- పూరీ తీర ప్రాంతానికి 430 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఫోణి తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో పూరీ వైపు కదులుతోందని ఒడిశా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నానికి గోపాల్ పూర్-చాంద్ బాలి ప్రాంతాల మధ్య తీరాన్ని తాకవచ్చని అంచనా వేశారు. తమ అంచనాకు అనుగుణంగానే తుఫాన్ కదలికలు ఉన్నాయని అధికారులు నిర్ధారించారు.