13 ఏళ్ల పసితనం... బిడ్డకు జన్మనిచ్చిన అత్యాచార బాధితురాలు... కామాంధుడి పశువాంఛకు బలై...
ఉత్తరప్రదేశ్లో 13 ఏళ్ల ఓ అత్యాచార బాధితురాలు శుక్రవారం(ఫిబ్రవరి 19) బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన కాసేపటికే ఆ బిడ్డ మృతి చెందింది. 13 ఏళ్ల పసితనంలో ఓ కామాంధుడి పశువాంఛకు ఆ చిన్నారి గర్భం దాల్చింది. విషయం ఆలస్యంగా తెలియడంతో చిన్నారికి గర్భస్రావం సాధ్యపడలేదు.
బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ప్రస్తుతం ఆ చిన్నారి ఏడో తరగతి చదువుతోంది. తమ కాలనీలోనే ఉండే సికిందర్ అలియాస్ అమరనాథ్ తివారీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గతేడాది అగస్టు 15న చిన్నారిని అతని ఇంటికి పిలిచి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. చిన్నారిని భయభ్రాంతులకు గురిచేసి... ఆ తర్వాత కూడా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.
నిందితుడికి భయపడి బాలిక తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పలేదు. బాలిక తల్లిదండ్రులు కూడా ఆమెలో మార్పులను గమనించలేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న బాలిక అనారోగ్యానికి గురవడంతో వైద్య పరీక్షలు చేయించారు. దీంతో ఆమె గర్భంతో ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలిసి చిన్నారి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. చిన్నారిని ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. అప్పటికే నెలలు నిండటంతో గర్భం తీయించడం సాధ్యపడలేదు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పురిట్లోనే చనిపోయిన బిడ్డ పోస్టుమార్టమ్ రిపోర్టుతో పాటు డీఎన్ఏ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా,ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. గతేడాది యూపీలో చోటు చేసుకున్న హత్రాస్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమైనా... మహిళలపై నేరాలకు మాత్రం అడ్డుకట్ట పడలేదు.
మూడేళ్ల క్రితం ఇదే తరహా ఘటన మహారాష్ట్రలోని నాగపూర్లో వెలుగుచూసింది. 13 ఏళ్ల బాలిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. బాలికకు మామ వరుసయ్యే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. బాలికకు నెలలు నిండేంతవరకూ ఈ విషయాన్ని ఆమె సవతి తల్లి గుర్తించలేకపోయింది. దీంతో ఆ పసి వయసులోనే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. బాధితురాలి సవతి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదైంది.