Uttar Pradesh Road Accident : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం... 18 మంది అక్కడికక్కడే మృతి..
ఉత్తరప్రదేశ్లోని బరాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డబుల్ డెక్కర్ బస్సును ట్రక్కు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు.మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్నో-అయోధ్య జాతీయ రహదారిపై రామ్ సనేహీ ఘాట్ సమీపంలో అర్ధరాత్రి 1.30గం. సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
లక్నో జోన్ ఏడీజీ సత్య నారాయణ మాట్లాడుతూ... ప్రమాదంలో 18 మంది చనిపోయినట్లు ధ్రువీకరించారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రికి తరలించాక మృతి చెందినట్లు తెలిపారు. మరొకరు చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు చెప్పారు. ప్రమాదంలో బస్సు తీవ్రంగా దెబ్బతినడంతో ఇప్పటికీ చాలామంది అందులోనే చిక్కుకుపోయారని... వారిని బయటకు తీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఎక్కువమంది బిహార్,సీతామర్హి,సహర్స ప్రాంతాలకు చెందినవారేనని గుర్తించామన్నారు. బతుకుదెరువు కోసం పంజాబ్,హర్యానా రాష్ట్రాలకు వలస వెళ్లిన వీరు... తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గత నెలలో ఇదే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బస్సు, జేసీబీ ఢీకొన్న ఘటనలో 17 మంది మృతి చెందగా.. 24 మందికిపైగా గాయపడ్డారు. కాన్పూర్ సమీపంలోని సచేండి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సు లక్నో నుంచి ఢిల్లీ వైపు వెళ్తోంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావించారు. మృతుల కుటుంబాలకు పీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. యూపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్గేషియా ప్రకటించింది.