అమానుషం.. సర్జరీ చేసి కుట్లు వేయకుండా... బాధతో విలవిల్లాడుతూ చిన్నారి మృతి...
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. మూడేళ్ల బాలికకు పొట్ట భాగంలో సర్జరీ చేసిన వైద్యులు... ఆస్పత్రి బిల్లులు చెల్లించలేదన్న కారణంతో కుట్లు వేయకుండానే ఆ చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.దీంతో శరీరంపై సర్జరీ గాయంతో విలవిల్లాడిపోయిన ఆ చిన్నారి మరుసటిరోజే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ విచారణకు ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే... కౌశాంబి జిల్లాలోని మంజన్పూర్ పట్ణణానికి చెందిన ఓ నిరుపేద దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. ఫిబ్రవరి 16న బాలికకు కడుపు నొప్పి రావడంతో ప్రయాగ్రాజ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు చిన్నారికి శస్త్ర చికిత్స చేశారు. అయితే ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రి బిల్లు చెల్లించలేదన్న కారణంతో చిన్నారికి సర్జరీ చేసిన చోట కుట్లు వేయకుండానే వదిలేశారు. అలానే ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించి తీసుకెళ్లిపోవాలని చెప్పారు.
సర్జరీకి కుట్లు వేయకపోవడంతో ఆ చిన్నారి నొప్పితో విలవిల్లాడిపోయింది. ఆ మరుసటిరోజే ప్రాణాలు విడిచింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ వద్ద ఉన్న డబ్బు మొత్తం ఆస్పత్రికి చెల్లించామని... అయినప్పటికీ మరో రూ.5లక్షలు డిమాండ్ చేశారని ఆ తల్లిదండ్రులు ఆరోపించారు. అంత డబ్బు చెల్లించే స్తోమత లేదని చెప్పడంతో కుట్లు వేయకుండానే చిన్నారిని అప్పగించారని చెప్పారు.
మరోవైపు ఆ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం చిన్నారి తల్లిదండ్రుల ఆరోపణలను ఖండించింది. ఆ పాప 15 రోజులు తమ ఆస్పత్రిలో ఉందని చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సర్జరీ చేసి, అబ్జర్వేషన్లో ఉంచినట్లు వివరించారు. పాప తల్లిదండ్రులు పేదవారు కావడంతో రూ1.2లక్షలు బిల్లు అయినప్పటికీ వారి నుంచి కేవలం రూ.6వేలు మాత్రమే వసూలు చేసినట్లు చెప్పారు.
పాప కోలుకోకపోవడంతో మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి రిఫర్ చేశామని... మరుసటి రోజు చిన్నారి తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్లారని చెప్పారు. తమ ఆస్పత్రిలో చికిత్స అందించినప్పుడు చిన్నారికి కుట్లు వేశామని చెప్పారు. మరో ఆస్పత్రిలో చికిత్స అందించినప్పుడు సర్జరీని పరిశీలించేందుకు కుట్లు విప్పి ఉంటారని అన్నారు.
చిన్నారిని మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని రోధిస్తున్న ఆ తల్లిదండ్రుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల కమిషన్ 24గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.