మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఘాతుకం: డీఎస్పీ సహా ఎనిమిది పోలీసులను కాల్చిచంపిన హిస్టరీ షీటర్లు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రౌడీషీటర్, అతని అనుచరులను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులపై వారు కాల్పులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది పోలీసులు మరణించారు. మృతుల్లో ఓ డీఎస్పీ ఉన్నారు. ఓ పౌరుడు సహా ఏడు మంది గాయపడ్డారు. వారిని కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
మరో స్టార్ను కోల్పోయిన ఫిల్మ్ ఇండస్ట్రీ: వెంటాడుతోన్న మరణాలు: గుండెపోటుతో ఆమె కన్నుమూత
కాన్పూర్ శివార్లలో గల చౌబెపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బికరూ గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. మోస్ట్ వాంటెడ్ హిస్టరీ షీటర్ వికాస్ దూబే, అతని అనుచరులు ఈ గ్రామంలో తలదాచుకుంటున్నట్లు కాన్పూర్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనితో వారిని అరెస్టు చేయడానికి ఈ తెల్లవారు జామున 20 మంది పోలీసులతో కూడిన రెండు ప్రత్యేక బృందాలు బికరూ గ్రామానికి వెళ్లాయి. అతను నివసిస్తోన్న ఇంటిని చుట్టుముట్టాయి.
పోలీసులను గమనించిన వికాస్ దూబే, ఇతర రౌడీషీటర్లు వారిపై యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో కాన్పూర్ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ దేవేంద్ర మిశ్రా సహా ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. మరో ఆరుమంది కానిస్టేబుళ్లు, ఒక పౌరుడు ఈ కాల్పుల్లో గాయపడ్డారు. వారిని వెంటనే కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల అనంతరం వికాస్ దూబే అతని అనుచరులు సమీప అడువల్లోకి పారిపోయారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.
బీజేపీకి చెందిన మంత్రి సంతోష్ శుక్లా హత్యతో సహా వికాస్ దూబేపై 60 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2001లో అప్పటి మంత్రి సంతోష్ శుక్లాను హత్య చేసినట్లు దుబేపై ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం అందిన వెంటనే కాన్పూర్ అదనపు డీజీపీ జైనారాయణ్ సింగ్, ఎస్ఎస్ప్పీ దినేష్ కుమార్, ఎస్పీ (వెస్ట్) అనిల్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై సమగ్ర నివేదికను అందజేయాలని సూచించారు.