యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ లేనట్లే.. కాంగ్రెస్ మరీ దారుణంగా..!
లక్నో : మహారాష్ట్ర, హర్యానా సాధారణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు 17 రాష్ట్రాల్లో మరో 51 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గురువారం (24.10.2019) నాడు ఫలితాలు వెలువడనున్నాయి. అదలావుంటే మహారాష్ట్రలో బీజేపీ కూటమి ముందంజలో ఉంది. చాలాచోట్ల బీజేపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. శివసేన అభ్యర్థిగా ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య థాకరే ముంబైలోని వర్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అక్కడ ఆయన కూడా ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కుర్చీ శివసేనకు ఇవ్వాలనే ప్రతిపాదన బీజేపీకి సంకటంగా మారింది.
హర్యానాలో హంగ్ తప్పదా.. చిన్న పార్టీకి సీఎం కుర్చీ ఆఫర్.. కాంగ్రెస్ కొత్త వ్యూహం ఫలించేనా?
అదలావుంటే ఉత్తరప్రదేశ్లో మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ క్రమంలో మొత్తం 11 స్థానాలు క్లీన్ స్విప్ చేస్తామని బీజేపీ పెద్దలు ధీమా వ్యక్తం చేశారు. కానీ అది కుదిరేలా కనిపించడం లేదు. ఇప్పటివరకైతే ఆరు స్థానాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అదలావుంటే సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు రెండు స్థానాల్లో దూసుకెళుతుండగా.. కాంగ్రెస్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన అభ్యర్థులు చెరొక స్థానంలో మాత్రమే ఆధిక్యం కనబరుస్తున్నారు.
2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లు గెలిచి బీజేపీ సత్తా చాటింది. అదే క్రమంలో ఈసారి ఉప ఎన్నికల్లో 11 స్థానాలకు గాను 10 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. గౌరవప్రదంగా అన్నీ స్థానాలు గెలుచుకుంటుందని ఆ పార్టీ పెద్దలు ధీమా వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ ఫలితాల సరళి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుండటం గమనార్హం. మొత్తానికి చివరి ఫలితాలు వెల్లడైతే గానీ ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుందో క్లారిటీ వస్తుంది.