యూపీ ఉప ఎన్నికలు: కొనసాగుతున్న ఓటింగ్, గెలుపుపై యోగి ధీమా
లక్నో/పాట్నా: ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఉత్తర ప్రదేశ్లోని రెండు, బీహార్లోని ఒక లోక్ సభ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది.
ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగుతున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ప్రసాద్ మౌర్య తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
బీజేపీని ఓడించేందుకు బద్ధశత్రువులుగా పేరుగాంచిన ఎస్పీ-బీఎస్పీలు ఈ ఉప ఎన్నికల కోసం చేతులు కలపడం గమనార్హం. అయినా, ఉప ఎన్నికలు జరిగే రెండు స్తానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
మరో వైపు బీహార్లోని అరారియా లోకసభ స్థానంతోపాటు రెండు అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ జరుగుతోంది. మహాకూటమి నుంచి నితీశ్ బయటికి వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావటంతో ఆసక్తి నెలకొంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మార్చి 14న ఫలితాలు వెలువడుతాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావటంతో ఈ రెండు రాష్ట్రాల ఉప ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది.