పోలింగ్ ఆరంభానికి ముందు సీఎం పూజలు: ఇష్ట దైవం ఎదురుగా..ఒంటరిగా!
లక్నో: సార్వత్రిక ఎన్నికల తుదిదశ పోలింగ్ ఆరంభం కావడానికి ముందు- ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తన ఇష్టదైవాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఆయన ఉత్తర్ ప్రదేశ్లోని ప్రఖ్యాత గోరఖ్నాథ్ మందిరానికి వెళ్లారు. వేకువజాము నాటి పూజల్లో పాల్గొన్నారు. గోరఖ్నాథుడికి పూజలు చేశారు. అనంతరం- ప్రధాన అర్చకుడిని కూడా బయటికి పంపించేసి, సుమారు 20 నిమిషాల పాటు ధ్యానంలో గడిపారు. ఆ సమయంలో గర్భాలయంలో ఆయన ఒక్కరే కనిపించారు.
రాజకీయాల్లో ప్రవేశించడానికి ముందు- యోగి ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ ఆలయానికి ప్రధాన అర్చకుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. చాలాకాలం పాటు ఆయన ప్రధాన అర్చకుడిగా ఉన్నారు. భారతీయ జనతాపార్టీలో చేరిన తరువాత గోరఖ్పూర్ లోక్సభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1998 నుంచి 2014 వరకు జరిగిన అన్ని లోక్సభ ఎన్నికల్లోనూ యోగి.. తిరుగులేని మెజారిటీతో గెలుస్తూ వచ్చారు. దీనితో ఆయనను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించింది బీజేపీ అధిష్ఠానం.
తాను రాజీనామా చేయడం వల్ల.. గోరఖ్పూర్ లోక్సభ స్థానానికి గత ఏడాది నిర్వహించిన ఉప ఎన్నికలో బీజేపీ దారుణంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. గోరఖ్పూర్ లోక్సభ స్థానాన్ని బీజేపీకి కంచుకోటగా మార్చిన యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉండగా బీజేపీ ఓడిపోవడం గమనార్హం. సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం బీజేపీని దెబ్బతీసింది.
ఇప్పుడు అదే ఫార్ములాను ఎస్పీ, బీఎస్పీ లోక్సభ ఎన్నికల్లో అమలు చేసింది. గోరఖ్పూర్ నియోజకవర్గంలో తిరిగి పాగా వేయడానికి బీజేపీ పెద్ద కసరత్తే చేసింది. భోజ్పురి సూపర్స్టార్ రవికిషన్ను బరిలో దించింది. రేసుగుర్రం సినిమాతో మద్దాలి శివారెడ్డిగా రవికిషన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.