హిందూ వ్యతిరేకి, జీహాదీలు: నిద్రపోతున్న కర్ణాటక ప్రభుత్వం ఇంటికి: యూపీ సీఎం యోగీ !
బెంగళూరు: కర్ణాటకలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉందని, ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగడానికి నైతికహక్కు లేదని, వెంటనే సిద్దరామయ్య సర్కారును ఇంటికి పంపించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. జీహాదీలను పెంచిపోషిస్తున్న సిద్దరామయ్య ప్రభుత్వం 24 మంది హిందూ కార్యకర్తను హత్య చేయించిందని గురువారం శిరిసిలో జరిగిన కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారంలో యోగీ ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
దేశంలోనే నెంబర్ వన్
కర్ణాటకలో రైతుల వ్యతిరేక ప్రభుత్వం ఇంతకాలం కొనసాగిందని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వం వైఫల్యం వలన దేశంలోని ఎక్కువ మంది రైతులు కర్ణాటకలోనే ఆత్మహత్యలు చేసుకున్నారని యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ లో లేరు
ఉత్తరప్రదేశ్ లో జీహాదీలు లేరని, కర్ణాటకలో విచ్చిలవిడిగా జీహాదీలు పెరిగిపోయారని యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో అమాయకులను హత్య చెయ్యరని, కర్ణాటకలో అమయకులను దారుణంగా హత్య చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకొవడం లేదని, కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా ఇలాగే ఉంటుందని యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు.
మీకు అభివృద్ది కావాలి
కర్ణాటక అభివృద్ది కావాలంటే బీజేపీకి ఓటు వెయ్యాలని కన్నడిగులకు యోగీ ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ది చెయ్యడానికి అవకాశం ఉంటుందని, ఆ విషయం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో రుజువు అయ్యిందని యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు.
నిద్రలో ఐదు ఏళ్ల ప్రభుత్వం
కర్ణాటకలో నిద్రలోనే ఐదు ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిపోయిందని సిద్దరాయ్యను ఉద్దేశించి యోగీ ఆదిత్యనాథ్ వ్యంగంగా అన్నారు. సీఎం సిద్దరామయ్య నిద్రపోతుంటే ఇక అభివృద్ది ఎక్కడ జరుగుతుందని, అన్నదాతల ఆత్మహత్యలు ఎవరు ఆపుతారని యోగీ ఆదిత్యనాథ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
యోగీ కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్
బీజేపీకి ప్రచారం చెయ్యడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కర్ణాటకాకు ఎన్నిసార్లు ఎక్కవగా వస్తే అంత మాకే మంచిదని సీఎం సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు. యోగీ ఆదిత్యనాథ్ విమర్శలపై దావణగెరెలో మాట్లాడిన సిద్దరామయ్య యోగీ ఆదిత్యనాథ్ కర్ణాటకలో ప్రచారం చేస్తే కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు పడుతాయని జోస్యం చెప్పారు.