తండ్రి అంత్యక్రియలకు యోగి దూరం: తల్లి సహా ఎవరూ వెళ్లొద్దు: 23 కోట్ల మంది ప్రజల కోసమే..!
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో కన్నుమూసిన తన తండ్రి భౌతిక కాయానికి నిర్వహించబోయే అంత్యక్రియలకు దూరంగా ఉండబోతున్నారు. ఆయనే కాదు.. కుటుంబ సభ్యులు కూడా ఎవరూ పాల్గొనకూడదని విజ్ఙప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ భిష్త్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
Recommended Video
దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతోన్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారం తెలిసే సమయానికి యోగి లక్నోలో కరోనా వైరస్ నియంత్రణపై సమీక్షా సమావేశంలో ఉన్నారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆయన సమావేశాన్ని రద్దు చేశారు. కొద్దిసేపటికే ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో 23 కోట్ల మంది ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు. ప్రజల యోగ క్షేమాలకు ప్రాధాన్యత ఇస్తున్నానని స్పష్టం చేశారు.
ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న వారు ఒకే ప్రాంతంలో గుమికూడటం వల్ల కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండటానికి తాను తండ్రి భౌతిక కాయానికి నిర్వహించబోయే అంత్యక్రియలకు హాజరు కావట్లేదని అన్నారు. కరోనా వైరస్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన వెంటనే తాను తండ్రి సమాధిని దర్శిస్తానని చెప్పారు. ఆనంద్ సింగ్ భిష్త్ సోమవారం ఉదయం కన్నుమూశారు.
ఆయన వయస్సు 80 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేశ రాజధానిలోని ప్రఖ్యాత అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్)లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం 10:44 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆనంద్ సింగ్ భిష్త్ డీహైడ్రేషన్, లో-బీపీ, కిడ్నీ, లివర్ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఆయనను ఎయిమ్స్లో చేర్చారు. అక్కడే చికిత్స పొందు కన్నుమూశారు.