ఆకులు కాలాక: అఖిలేశ్
2014 ఎన్నికలకు ముందు బద్ధ శత్రువులైన ఆర్జేడీ అధినేత, బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి జత కట్టి బీహార్లో సత్ఫలితాలు సాధించడంలో యూపీలోని ఎస్పీ, తదితర పక్షాలు విఫలమయ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఏడాదిన్నర ముందు నుంచే బీజేపీ, సంఘ్ పరివార్ ఉమ్మడిగా సర్వ సన్నద్ధమవుతుంటే సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), మాయావతి సారథ్యంలోని బీఎస్పీ ఎవరికి వారే యమునా తీరేనన్న చందంగా ఎత్తులు, వ్యూహాలు అమలుచేస్తూ వచ్చాయి.
ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని పార్టీపై పట్టుకోసం ఎస్పీ అంతర్యుద్ధానికి దిగిన ఫలితంగా ప్రజల్లో ఒక సెక్షన్కు దూరమై.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై ఒకరు అంచనాలకు మించి సీట్లడిగితే.. మరొకరు ఆధిపత్య రాజకీయమే తప్ప ముందు చూపే లేకుండా వ్యవహరించాయి.
కాంగ్రెస్ పార్టీ అతి అంచనాలు.. బీఎస్పీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ (ఆర్ఎల్డీ) అధినేత అజిత్ సింగ్ లతో పొత్తుకూ ఎస్పీ ఏకపక్ష వైఖరి ప్రదర్శించినందుకే అన్ని పార్టీలు ప్రణాళికాబద్ధంగా సంఘ్ పరివార్ రూపొందించిన ఎన్నికల 'పద్మవ్యూహం'లో చిక్కుకుని ఇప్పుడు విలవిలలాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మధ్య రాజకీయ పొందికల్లో సారూప్యతలు చాలా ఉన్నాయి.
యూపీ, బీహార్ సమీకరణాల్లో సారూప్యతలివి..
రెండు రాష్ట్రాల రాజకీయాల్లోనూ యాదవ్లు, ముస్లింలు, కుర్మీలు తదితర సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 1989 తర్వాత బీహార్లో లాలూప్రసాద్ యాదవ్, జార్జి ఫెర్నాండెజ్, శరద్ యాదవ్, రఘు వంశీ ప్రసాద్, నితీశ్ కుమార్, జయాజైట్లీ తదితరులు రాం మనోహర్ లోహియా సిద్ధాంతం పట్ల ఆకర్షితులైన వారు. సోషలిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయడంతో వీపీ సింగ్ ఏర్పాటు చేసినజనతాదళ్ పార్టీలో భాగస్వాములు. ఇక యూపీలో ములాయం సింగ్ యాదవ్, బేణి ప్రసాద్ వర్మ, మాజీ ప్రధాని వీపీ సింగ్ ప్రభ్రుతులు జనతాదళ్ పార్టీలో కీలక పాత్ర పోషించారు.
రెండు స్థానాల నుంచి ప్రధాన శక్తి స్థాయికి బీజేపీ ఇలా..
1990లో రామజన్మభూమి - బాబ్రీ మసీద్ వివాదం పేరిట 'మందిర్' రాజకీయాలకు తెర తీస్తూ ప్రస్తుతం బీజేపీలో మార్గదర్శక్ మండలికి పరిమితం అయిన ఎల్కే అద్వానీ చేపట్టిన రధయాత్రను లాలూ అడ్డుకోవడం.. కేంద్రంలో వీపీ సింగ్, యూపీలో ములాయం సింగ్యాదవ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరణ.. చకచకా జరిగిపోయాయి. నాటి నుంచి క్రమంగా ఎదుగుతూ వచ్చిన బీజేపీ.. ఈ నాడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నది. తొలుత 2014 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో మిత్ర పక్షాలతో కలిసి 73 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో మీడియా అంచనాలకు అందకుండా.. 300లకు పైగా స్థానాల్లో విజయం సాధించింది.
బద్ధ శత్రువులను ఒకటి చేసిన మోదీ
లోక్సభ తీర్పుతో బీహార్లో బద్ధ శత్రువులుగా ఉన్న లౌకిక వాద పార్టీ రాజకీయ నేతలుగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్, నితీశ్కుమార్ ఒక్కటయ్యారు. వీరికి కాంగ్రెస్ పార్టీ జత కలిసింది. ఫలితంగా ‘మహా కూటమి (మహా ఘట్బంధన్) ఏర్పాటైంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించింది. మోదీ ప్రభంజనాన్ని ధీటుగా ఎదుర్కొన్నది. అదే తరహాలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ మధ్య ‘మహా కూటమి' ఏర్పాటుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిజాయితీగా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎస్పీలో అంతర్గత విభేదాల్లో పై చేయి సాధించిన అఖిలేశ్ యాదవ్.. చివరి దశలో మాత్రమే కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకోగలిగారే తప్ప.. ఆర్ఎల్డీని దూరం పెట్టడానికే సుముఖత వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ మహా కూటమి ఏర్పాటులో బీఎస్పీని కలుపుకోవడంలో విఫలమైన ఫలితం వాటిని కోలుకోలేని దెబ్బ తీశాయి. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా యూపీలోనూ ఇదే తరహా మహా కూటమి ఏర్పాటు జరిగి ఉంటే తమ రాష్ట్రంలో మాదిరిగా మోదీ హవాను నిలువరించగలిగే వారమని పేర్కొన్నారు. బీహార్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ జత కలువడంతో యాదవులు, ముస్లింల బలం తోడయ్యింది.
పండని ఔట్సైడర్ భావోద్వేగం..
బీహార్లో మాదిరిగానే యూపీలోనూ ప్రధాని నరేంద్రమోదీ ప్రగతి మంత్రమే ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించింది. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ జోడీ.. నరేంద్రమోదీ ప్లస్ అమిత్ షా జోడీని ‘బీహారీ వర్సెస్ బహరీ' అని ప్రభోదిస్తూ బీహారీల్లో సెంటిమెంట్ రేకెత్తించారు. అలాగే యూపీలోనూ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ సహా ఎస్పీ, కాంగ్రెస్ నేతలంతా.. మోదీ ప్లస్ అమిత్ షా జోడీని బయటి వారన్న సెంటిమెంట్ రగిల్చిందుకు చేసిన ఫలితం పండలేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడురాలు సోనియాగాంధీ తనయ ప్రియాంక గాంధీ కూడా మోదీ, అమిత్ షా జోడీపై భావోద్వేగ పూరిత సెంటిమెంట్ రగిల్చేందుకు యత్నించారు. బీహార్లో ఆర్జేడీకి మాదిరిగానే యూపీలో ఎస్పీకి యాదవ్లు దన్నుగా నిలిచారు. యూపీలోని 15 శాతం మంది యాదవ్లు, 18 శాతం మంది ముస్లింలు ఎస్పీకి అండగా ఉన్నారు. 2012లో ఎస్పీని అధికారంలోకి తెచ్చిందీ ఈ రెండు సామాజిక వర్గాలే.
ఇలా బీఎస్పీ వైఫల్యం..
2012 ఎన్నికల్లో ఎస్పీకి అత్యధికంగా 29.15 % ఓట్లు లభించగా, 403 స్థానాలకు 224 స్థానాల్లో ఎస్పీ విజయం సాధించింది. ఎస్పీకి ప్రతిపక్షం బీఎస్పీ 25.91 % ఓట్లు పొంది 80 స్థానాల్లో గెలుపొందింది. రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 11.63 శాతం ఓట్లు సాధించి 28 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం సంచలన విజయం సాధించిన బీజేపీ 2012 ఎన్నికల్లో కేవలం 15 శాతం ఓట్లు పొంది 47 స్థానాలకు పరిమితం అయ్యింది. కనుక ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీచేస్తే బీజేపీ సవాల్ను ఎదుర్కోగలిగి ఉండేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార ఎస్పీ ప్రభుత్వ వ్యతిరేకత తమకు ఎక్కడ నష్టం చేకూరుస్తుందోనని బీఎస్పీ అధినేత మాయావతి భయపడ్డారే గానీ, ముస్లింల ఓట్లు చీలకుండా ఉండాలంటే బీహార్లో మాదిరిగా మహా కూటమి జత కట్టేవారు. బీహార్లో మాదిరిగానే దళితులు, బ్రాహ్మణులు కూడా ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలకు బాసటగా నిలిచే వారని విశ్లేషకుల మాట.
మూడోసారి సీఎంగా నితీశ్ ఇలా..
బీహార్ రాష్ట్రంలో యాదవులు 14 శాతం, ముస్లింలు 17 శాతం, సీఎం నితీశ్ కుమార్ సామాజిక వర్గం కుర్మీలు నాలుగు శాతంగా ఉన్నారు. వారంతా మహా కూటమికి అండగా నిలిచారు. 243 మంది స్థానాల అసెంబ్లీలో ఆర్జేడీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేశాయి. మిగతా కాంగ్రెస్ పార్టీలో 41 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. జేడీయూ 80, ఆర్జేడీ 71, కాంగ్రెస్ 27 స్థానాల్లో విజయం సాధించాయి. ఆర్జేడీకి 18.4 %, జేడీయూకు 16.8%, కాంగ్రెస్ పార్టీకి 6.7% ఓట్లు లభించాయి.
బీజేపీకి బీహార్లో 24.4 % వచ్చినా విపక్ష పాత్రే
బీహార్ రాష్ట్రంలో మహా కూటమి దాటిని ఎదుర్కోవడంలో బీజేపీ ఏర్పాటుచేసిన కూటమి నిలబడలేకపోయింది. 157 నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ 53 స్థానాలకు పరిమితమైనా ఒంటరిగా 24.4 శాతం ఓట్లను పొందగలిగింది. కానీ యూపీలో పరిస్థితులు ఆచరణలో భిన్నంగా మారాయి. పరస్పరం పోటీలతో ఎస్పీ - కాంగ్రెస్, ఆర్ఎల్డీ, బీఎస్పీ.. బీజేపీకి లబ్ధి చేకూర్చాయి.
అఖిలేశ్ పరిస్థితి ఇదీ..
బీజేపీ వైరి పక్షాలుగా తనతోపాటు బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ కలిసి పోటీ చేస్తే సత్ఫలితాలిస్తాయని ‘చేతులు కాలాక' అఖిలేశ్ యాదవ్ ఆకులు పట్టుకునే ప్రయత్నంచేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాగానే ఈ నెల తొమ్మిదో తేదీన అఖిలేశ్ యాదవ్.. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు అవసరమైతే బీఎస్పీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని చెప్పారు. రాష్ట్రపతి పాలన విధించడానికి అనుమతించబోమన్నారే గానీ అప్పటికే కాలాతీతమైందని గుర్తించలేకపోయారు.