మాస్ సూసైడ్: ఇద్దరు పిల్లలను పొడిచి చంపి, కుటుంబం మొత్తం ఆత్మహత్య: పెంపుడు కుందేలును సైతం.. !
లక్నో: ఇద్దరు పిల్లలను పొడిచి చంపిన ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరొకరు కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో మంగళవారం ఉదయం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక కారణాల వల్లే ఆ కుటుంబం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఉలిక్కి పడ్డ ఘజియాబాద్
మృతుల పేర్లు గుల్షన్ వాసుదేవ్, ఆయన భార్య పర్వీన్, కుమార్తె కృతిక, కుమారుడు రితిక్. గుల్షన్ వాసుదేవ్ వద్ద మేనేజర్ గా పని చేస్తోన్న సంజన అనే మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ఘజియాబాద్ ఉలిక్కి పడింది. చాలాకాలంగా గుల్షన్ కుటుంబం ఘజియాబాద్ ఇందిరాపురం వైభవ్ ఖండ్ ప్రాంతంలోని కృష్ణా సఫైర్ అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. గుల్షన్ వాసుదేవ్, పర్వీన్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అపార్ట్ మెంట్ ఎనిమిదో అంతస్తు నుంచి
గుల్షన్ వాసుదేవ్ చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాటిని పర్యవేక్షించడానికి సంజన అనే మహిళను మేనేజర్ గా నియమించుకున్నారు. ఆమె ప్రస్తుతం అదే అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. గుల్షన్ వాసుదేవ్, పర్వీన్, సంజన కృష్ణా సఫైర్ అపార్ట్ మెంట్ ఎనిమిదో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గుల్షన్ వాసుదేవ్, సంజన సంఘటనాస్థలంలో మరణించారు. కొస ప్రాణాలతో ఉన్న సంజనను అపార్ట్ మెంట్ వాసులు సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స విభాగంలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ప్లాట్ లో రక్తపు మడుగులో..
ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే అపార్ట్ మెంట్ వాసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుల్షన్ వాసుదేవ్ ప్లాట్ తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా. కుమార్తె కృతిక, కుమరుడు రితిక్ లు రక్తపు మడుగులో కనిపించారు.. నిర్జీవంగా. వారి ఒంటిపై కత్తిపోట్లు కనిపించాయి. ఆ పక్కనే రక్తపు మరకలు అంటిన కత్తి లభించింది. గుల్షన్ వారిని హత్య చేసిన అనంతరం.. బలవన్మరణానికి పాాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అక్కడే- వారి పెంపుడు కుందేలు సైతం నిర్జీవంగా కనిపించింది.
తమకు మరణానికి కారణం అతనే అంటూ..
తమ మరణానికి కారణం రాకేశ్ వర్మ అనే అక్షరాలు ఫ్లాట్ గోడలపై కనిపించాయి. దీనితో రాకేశ్ వర్మ ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాకేశ్ వర్మ గురించి దీనిపై అపార్ట్ మెంట్ వాసులు, బంధువులను ప్రశ్నించారు. రెండు కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు గుల్షన్ వాసుదేవ్, రాకేశ్ వర్మ మధ్య కొంతకాలంగా నడుస్తున్నాయని బంధువులు వెల్లడించారు. కొంతకాలంగా అతను కనిపించట్లేదని తెలిపారు. ఈ ఆర్థిక లావాదేవీల వల్లే గుల్షన్ వాసుదేవ్.. ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.