తల్లిదండ్రులను బంధించి.. కుమార్తెపై గ్యాంగ్ రేప్
లక్నో : ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న అత్యాచార ఘటనలు కలవరపెడుతున్నాయి. గత జూలైలో బులంద్ షహర్ లో తల్లీకూతుళ్లపై చోటు చేసుకున్న అత్యాచార ఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్ లోని లఖ్ నపూ ప్రాంతంలో మరో సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుంది.
మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో.. దాదాపు 20 మందికి పైగా దొంగలు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. దొంగతనం సమయంలో ఆ ఇంటి కుటుంబ సభ్యులందరినీ బంధించిన దొంగలు.. పని పూర్తయ్యాక తిరిగి వెళ్లేటప్పుడు 12 ఏళ్ల ఆ ఇంటి యజమాని కుమార్తెను తమ వెంట తీసుకెళ్లారు. అలా.. కొంతదూరం వెళ్లాక 20 మంది దుండగుల్లో ఐదుగురు దుండగులు బాలికపై అత్యాచారం చేశారు.
విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు వెల్లడించడంతో.. బాధిత కుటుంబం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే గత జూలైలోను బులంద్ షహర్ ప్రాంతంలో ఓ కారుపై దాడిచేసిన కొంతమంది దుండగులు.. కుటుంబ సభ్యులను బంధించి తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.