ఆధ్యాత్మిక నగరిలో కొత్త సంవత్సర శోభ: ఎముకలు కొరికే చలిని లెక్కచేయక.. !
లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం నూతన సంవత్సర శోభను సంతరించుకుంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. గంగమ్మకు హారతిని సమర్పించారు. కొత్త సంవత్సరం తొలిరోజు కావడంతో కనీసం మూడు లక్షలమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
మంగళవారం నుంచే వేల సంఖ్యలో భక్తులు వారణాశికి చేరుకోవడం కనిపించింది. భక్తులతో వారణాశి ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడాయి. నివాస వసతి సౌకర్యాలు లభించకపోవడంతో వందలాది మంది భక్తులు ఫుట్ పాత్ లను ఆశ్రయించారు. ఎముకలు కొరికే చలిలోనూ అక్కడే ముసుగేసుకున్నారు. ఈ తెల్లవారు జామున 3 గంటలకు ఆలయ తలుపులను తెరిచారు అర్చకులు. సంప్రదాయబద్ధంగా తొలిపూజలను నిర్వహించిన అనంతరం కాశీ విశ్వనాథుడిని దర్శించడానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.
వేలమంది భక్తులతో గంగానది తీరం క్రిక్కిరిసిపోయింది. గంగానదిలో పవిత్ర స్నానాలను ఆచరించారు. ఈ తెల్లవారు జామున గంగమ్మకు ప్రత్యేక హారతిని నిర్వహించారు. ఈ సంవత్సరపు తొలి గంగా హారతిని తిలకించడానికి భక్తులు ఎగబడ్డారు. భక్తుల రాకకు అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రోజంతా స్వామివారి దర్శనాన్ని కల్పించే అవకాశం ఉంది. తొక్కిసలాట చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
#WATCH Ganga Aarti in Varanasi on the first morning of the year 2020 #NewYear pic.twitter.com/RBRigvm3av
— ANI UP (@ANINewsUP) January 1, 2020